మహిళలకు అవకాశమివ్వాలనే జయసుధకు సపోర్ట్: మురళీమోహన్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సినీ నటి జయసుధకు మద్దతిస్తున్నామని ‘మా' అధ్యక్షుడు మురళీ మోహన్ చెప్పారు. మంగళవారం ఈ అంశమై మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటీవ్ కమిటీలో ఏడుగురు మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇటీవలే కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులను కలిశానని, పేద కళాకారులను ఆదుకోవాలని కోరానని మురళీమోహన్ చెప్పారు. పేద కళాకారులకు పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, నటులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం నటుడు రాజేంద్ర ప్రసాద్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. రాజేంద్ర ప్రసాద్కు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగేంద్రబాబు మద్దతు ప్రకటించారు.
కళామతల్లికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కాగా, జయసుధ, రాజేంద్ర ప్రసాద్ల తీవ్ర పోటీ నెలకొంది.