చంద్రబాబు ఇలాకాలో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ : సీఎం అంటూ నినాదాలు-హంగామా : వెనుక ఉన్నదెవరు..!!
టీడీపీ..జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. జూనియర్ తో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అభిమానులకు నచ్చటం లేదా. ఏం జరుగుతోంది. జూనియర్ ఫ్యాన్స్ సడన్ గా ఎందుకు బయటకు వచ్చారు. ఇప్పుడు అటు సినీ...ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. 2009 ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేసి..కొద్ది సభలతోనే..తన ప్రసంగాలతో తన రాజకీయ స్టామినా ఏంటో జూ ఎన్టీఆర్ నిరూపించుకున్నారు. అయితే, ఆ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో సడన్ గా జూనియర్ తన ఎన్నికల ప్రచారం ముగించాల్సి వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ వర్సస్ టీడీపీ నేతలు
ఆ తరువాత జరిగిన పార్టీ మహానాడు వేదికల పైనా జూనియర్ కనిపించారు. కానీ, పార్టీలో లోకేశ్ ప్రమేయం పెరిగే కొద్దీ జూనియర్ పార్టీకి దూరమయ్యారు. ఇక, తాజాగా ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో కాలు పెట్టనని శపధం చేసారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీని పైన పలువురు రాజకీయ నేతలు..నందమూరి కుటుంబం సీరియస్ గా స్పందించింది.
తారక్ తాజా స్పందనతో మొదలైన వివాదం
ఇక, జూనియర్ స్పందన ఆలస్యం కావటంతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తారక్ ను తప్పు బట్టారు. విదేశాల్లో ఉన్న తారక్ ఒక వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయం స్పష్టం చేసారు. అందులో చంద్రబాబు.. భువనేశ్వరి పేర్లు ప్రస్తావించలేదు. అదే సమయంలో కొడాలి నాని..వంశీల పేర్లతో పాటుగా పార్టీల పేర్లు ప్రస్తావనకు తీసుకురాలేదు. దీని పైన టీడీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వర్ల రామయ్య..బుద్దా వెంకన్న లాంటి వారు నేరుగా జూనియర్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. సింహాద్రి..ఆది లాగా వస్తారనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ కామెంట్ చేసారు.
కొడాలి నాని వ్యాఖ్యలు సైతం మరింతగా
ఇదే సమయంలో కొడాలి నాని సైతం తాము గతంలో జూనియర్ తో కలిసి ఉన్నామని..ఆయన మమ్మల్ని కంట్రోల్ చేయట ఏంటి.. తాము ఇప్పుడు జగన్ కోసం పని చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో జూనియర్ మాత్రం స్పందించలేదు. కానీ, ఆయనను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరిణామాల్లో తమ హీరోను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక, ఆదివారం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ అభిమానలు హల్ చల్ చేసారు. కుప్పంలోని ఓ థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా చేసారు.
చంద్రబాబు అడ్డాలో జూనియర్ కు మద్దతుగా
సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వందల మంది ఎన్టీఆర్ అభిమానులు ఓ థియేటర్లో జైలవకుశ స్పెషల్ షో వేసుకున్నారు. సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జూనియర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల పర్యటన సమయంలో కుప్పంలో ఇదే విధంగా జూనియర్ అభిమానులు తారక్ జెండాలను ప్రదర్శిస్తూ.. పార్టీ బాధ్యతలు అప్పగించాలని నినాదాలు చేసారు.
కానీ, చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. అయితే, అసలు కుప్పంలోనే ఈ స్థాయిలో జూనియర్ అభిమానులు ఆయన జెండాలు.. బ్యానర్లతో హంగామా చేయటం వెనుక ఎవరున్నారనే చర్చ మొదలైంది.
Recommended Video
జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాల వెనుక
ఇదంతా అభిమానులు వ్యూహాత్మకంగా చేస్తున్నారా..లేక, రాజకీయంగా ఇతరులు చేయిస్తున్నారా అనేది టీడీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. చంద్రబాబు ఇలాకాలో ఆయనవి లేదా లోకేశ్ కు అనుకూలంగా ఉండాల్సింది పోయి, జూనియర్ ప్రస్తావన పదే పదే రావటం పైన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో..పాటుగా ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయటం వెనుక వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..తాజాగా కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం ఒక సమస్యగా మారితే..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న హంగామా సైతం పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. రానున్న రోజుల్లో జూనియర సెగ టీడీపీకి తప్పేలా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.