బీజేపీ నేతల యూటర్న్: ఆ విషయంలో జగన్కు మద్దతు: కేంద్రాన్ని ఒప్పించైనా..!
కర్నూలు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు అడకత్తెరలో పడినట్లు కనిపిస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజకీయ తీర్మానాన్ని చేసిన తరువాత బీజేపీకి రాయలసీమకు చెందిన పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెనకడుగు వేసేలా కనిపిస్తోంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఒక్క విషయంపై మాత్రమే బీజేపీ వైఖరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించేలా మారినట్లు చెబుతున్నారు. తాజాగా బీజేపీ నాయకులు తీసుకున్న ఈ నిర్ణయం.. తమ పొత్తు పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఝలక్ ఇచ్చినట్టయిందని అంటున్నారు.
ఎన్టీఆర్ బాటలో జగన్: శాసనమండలి రద్దు దిశగా: ఈ రాత్రికే ముహూర్తం?: కేబినెట్ అత్యవసర భేటీ..!
కర్నూలు డిక్లరేషన్.. మేనిఫెస్టోలో హామీ
మూడు రాజధానులను ఏర్పాటు చేయడం, ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో ఓటింగ్.. వంటి కీలక పరిణామాల మధ్య రాష్ట్ర బీజేపీ అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడానికి కర్నూలు డిక్లరేషన్ కారణమైనట్లు చెబుతున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నాయకులు గత ఏడాది ముగిసిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. ఈ రెండు అంశాలూ ఏపీ బీజేపీ నాయకుల ముందరి కాళ్లకు బంధం వేసినట్లు కనిపిస్తోంది.
కర్నూలులో హైకోర్టుకు ఓకే..
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాలని నిర్ణయించుకున్నామని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలోనే, దేశ రాజధాని వేదికగా స్పష్టం చేయడం వెనుక కర్నూలు డిక్లరేషన్, మేనిఫెస్టోల్లో పొందుపరిచిన అంశాలేనని పని చేశాయని అంటున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంలో అవసరమైతే తాను న్యాయమంత్రిత్వ శాఖను సైతం ఒప్పించే ప్రయత్నం చేస్తానంటూ జీవీఎల్ చెప్పడం.. వాటి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
హైకోర్టు తరలింపు కేంద్రం పరిధిలో..
అమరావతిలో ఉన్న తాత్కాలిక హైకోర్టును కర్నూలుకు తరలించాలనే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, దీనికోసం తాము కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఒప్పించైనా దాన్ని తరలించడానికి సహకరిస్తామని అన్నారు. హైకోర్టును రాయలసీమకు తరలించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకాారాన్ని అందిస్తామని జీవీఎల్ నరసింహారావు తేటతెల్లం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము హామీ ఇచ్చామని, దాన్ని ఈ రకంగానైనా నెరవేర్చుతామని అన్నారు.
విశాఖపైనే పేచీ..
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడంపైనే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని, దాన్ని అడ్డుకోవడానికి ఎంత దాకానైనా వెళ్లే అవకాశాలను పరిశీలిస్తామంటూ జీవీఎల్ వెల్లడించారు. అది కూడా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. పరిపాలనా రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల అమరావతిలో భూముల రేట్లు తగ్గిపోతాయని, తాము తీవ్రంగా నష్టపోతామనే భయాందోళనలు రైతుల్లో వ్యక్తమౌతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.