ఆలోచింపజేస్తాం... చైతన్యం కలిగిస్తాం..! అందుకే ఆ ఆయుధమన్న పవన్ కళ్యాణ్..!!
అమరావతి/హైదరబాద్ : గెలిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఒక్క సారి ఓడిపోతే ప్రపంచాన్ని చదివే వీలుంటుంది. ఓటమిలోనుంచి వచ్చే కసి వంద సునామీల బలంతో దూసుకెళ్తుంది అంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పరాజయం పాలైన అనంతరం...తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనేతల సమావేశం అయ్యారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలుపుతూ జనసేన పార్టీ తరఫున తీర్మానం చేశారు. అనంతరం పవన్కళ్యాణ్ మాట్లాడుతూ... ఓటు వేసిన వారితో పాటు జనసేన పోరాటయాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఒక అనుభవం అని , ఓటమిని ఓటమిగా గాక ఒక అనుభవంగా తీసుకుంటున్నామని అన్నారు.
ధోరణి మార్చుకున్న పవన్..! పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి పంపేందుకు కసరత్తు..!!
నాలుగేళ్ల వయసుగల జనసేన పార్టీకి ఇన్ని లక్షల మంది ఓటు వేశారంటే అది విజయంగానే భావిస్తున్నామని పవన్ విశ్లేషించారు. అయితే ఈ పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడవలసి వచ్చిందని ఉద్ఘాటించారు. పార్టీకి బలీయమైన క్యాడర్ ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని, భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పని చేసేవారందరూ ఒకే తాటిపై ఉండి ఒకే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.
పార్టీ బలోపేతంపై దృష్టి..! వెనక్కు తగ్గేది లేదంటున్న గబ్బర్ సింగ్..!!
ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలలో పార్టీకి ఉపకరించే అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఓటమికి మనం వ్యక్తులను కారణంగా చూపరాదని అన్నారు. దృడమైన సంకల్పంతో పార్టీ కోసం పని చేయాలనుకున్నవారే తనకు అవసరం అని కనీసం పదేళ్ల పాటు పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లగలిగే వారై ఉండాలని చెప్పారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకే తరహా ఆలోచనతో ముందుకు వెళ్లకపోతే విజయం సిద్దించదని అభిప్రాయపడ్డారు. తనతో పాటు వచ్చే వారు ఒకటి గుర్తుంచుకోవాలని చెప్పిన పవన్ తనతో ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి గానీ డబ్బు రాదని అన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కనేత ఈ ఎన్నికల నేపధ్యంలో స్వీయ విశ్లేషణ చేసుకోవాలని, తమ శక్తి సామర్ధ్యాలను ఎవరికి వారు బేరీజు వేసుకోవాలని చెప్పారు.
పార్టీకి అనూహ్యమైన క్యడర్ ఉంది..! కాపాడుకోవాలన్న కాటమ రాయుడు..!!
పార్టీకి అనుకూలమైన పవనాలు వీచినప్పుడు ఆ ఫలితాలు వేరుగా ఉంటాయని, మనకు జనబలం ఉంది ఆ బలాన్ని పార్టీ కోసం ఉపయోగించుకోవడం పార్టీ నేతల ముందున్న తక్షణ కర్తవ్యం అని పవన్ చెప్పారు. తన తుదిశ్వాస వరకు పార్టీని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మనం ఒక్కోసారి ఊహించని ఫలితాలు చూడవలసి ఉంటుంది. దానిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందు చూపు అవసరమన్నారు. తాను గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయానని పవన్ అంగీకరించారు.
ప్రతి అడుగు ప్రజాపక్షం వైపే..! తూటాలు కానున్న అక్షరాలు..!!
కాగా, పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలు కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేయడానికి పార్టీ పక్ష పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్టు పవన్కళ్యాణ్ వెల్లడించారు. ఈ పత్రికలో రాష్ట్ర, దేశ విదేశాలకు చెందిన పాలసీ నిర్ణయాలు, అభివృద్ది రంగాలకు చెందిన సమాచారం పొందుపరచాలని చెప్పారు. మేధావులు, కార్యకర్తల అభిప్రాయాలు వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక కావాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పడాలని ఆకాంక్షించారు. పత్రిక స్వరూప స్వభావాలు, ఎటువంటి శీర్షికలు ఉండాలో నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించనున్నట్టు వెల్లడించారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్లో విడుదల చేస్తామన్నారు. పత్రిక ఈ-మ్యాగజైన్తో పాటు ముద్రిత సంచికను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామన్నారు.