బుద్ధి ఉంటే చేస్తారు.. బాబు గురించి తెలియదు, మేం వస్తే మద్యనిషేధం: జగన్ సంచలనం
విజయవాడ: బుద్ధి ఉన్నవాడు ఎవరైనా మద్య నిషేధం చేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారో, చేయరో తనకు తెలియదని, తాము అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు.
కల్తీ మద్యం తాగి 5గురు మృతి చెందారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యుడు ఠంచనుగా ఉదయిస్తాడో లేదో నాకు తెలియదని, కానీ మద్యం దుకాణాలు మాత్రం ఉదయం ఆరు గంటలకే తెరుస్తున్నారని, రాత్రి రెండు మూడు గంటల వరకు తెరిచి ఉంచుతున్నారన్నారు.
రోజంతా మద్యం దుకాణాలు తెరిచి ఉంటే ఎలా అని ప్రశ్నించారు. రోజురోజు మరింత ఎక్కువ మద్యం ప్రజలతో తాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం కూడా పోస్తున్నారని, దీనికి బాధ్యత ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు.
మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, కల్తీ మద్యం పోస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం దుకాణం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మద్యం అమ్మకాలు 2014లో 6,632 కోట్లు అయితే, ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ.7050 కోట్లు దాడిందన్నారు. గత ఏడాది కంటే మద్యం అమ్మకాలు రెట్టింపు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందన్నారు. మద్యం దుకాణదారులు సమయపాలన పాటించడం లేదన్నారు.
సాక్షాత్తు మంత్రి గ్రామంలోనే బెల్టు షాపు ఉందన్నారు. ఇది మారాలని చెప్పారు. గుజరాత్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉందని, అయినప్పటికీ ఆ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు. బీహార్ కూడా మద్యం నిషేధం దిశగా అడుగేసిందన్నారు.
బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మద్యం నిషేధం చేస్తాడని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారో, చేయరో తనకు తెలియదన్నారు. 2019లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అప్పుడు మేం సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారు. ఏపీలో మేం సంపూర్ణ మద్య నిషేధం తెస్తామన్నారు.
మద్యం పాలసీ సంపూర్ణంగా మారాలన్నారు. పాఠశాలలు, దేవాలయాల ఎదుటే మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వస్తే మద్య నిషేధం చేస్తామని చెబుతోందని, అందుకోసమైనా చంద్రబాబు చేయాలన్నారు. మేం దీనిని అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు.
చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నారు. ఇసుక నుంచి అన్నింటా అన్యాయం చేస్తున్నారన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చేయలేదన్నారు. చంద్రబాబుది ప్రతి విషయంలో మోసం, అబద్దాలు అన్నారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.