పవన్ అనుమానాలు నివృత్తి చేస్తాం: ముద్దుకృష్ణమ, సిగ్గుచేటని..
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో దురుద్దేశాలు లేవని, పవన్కు అనుమానాలుంటే నివృత్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సమస్యలపై ఏపి సిఎం చంద్రబాబును కాంగ్రెస్ విమర్శించడం సిగ్గుచేటని ముద్దుకృష్ణమ ఆరోపించారు.
చంద్రబాబును అడిగే రాష్ట్ర విభజన చేశారా అని ప్రశ్నించారు. లాఠీచార్జీలు, ఫైరింగ్ లేని భూసమీకరణ ఘనత చంద్రబాబుదేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో సోంపేట, కాకరపల్లిలో ఆరుగురిని చంపి భూములు లాక్కున్నారని ఆయన గుర్తుచేశారు.
పోలవరంతో సీమకూ ప్రయోజనమే: దేవినేని
కర్నూలు: పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకూ ప్రయోజనం చేకూరుతుందని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు.
సాగునీరు కావాలని సీమలో దీక్షలు చేస్తున్నారని, మరోవైపు పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారని మంత్రి ఉమా విమర్శించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే జీవో 22 జారీ చేశామని, పనుల చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
రాజధానిపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: కళా వెంకట్రావ్
శ్రీకాకుళం: ఏపి రాజధానిపై ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్యే కళా వెంకట్రావ్ అన్నారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం చంద్రబాబుకే సాధ్యమని వెంకట్రావ్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కళా వెంకట్రావు కోరారు.