నాలుకలు తెగ్గోస్తాం: అనంతపురం రాజకీయ నేతలకు పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended Video
అనంతపురం: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అనంతపురం జిల్లా రాజకీయ నాయకులపై పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుకలు కోస్తామని కదిరి సీఐ మాధవ్ వార్నింగ్ ఇచ్చారు.
ఉపేక్షించేది లేదు..
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మగాళ్లమయ్యే ఉద్యోగం చేస్తున్నామని, శిఖండిలం కాదన్నారు. పోలీసులే కాదు.. పొలిటికల్ లీడర్లు ఫెయిల్ కారా? అని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ నాయకులు ఇద్దరూ ఇద్దరేనన్నారు.
భార్యలకు ముఖాలు చూపలేకపోతున్నాం
నేతల మాటలతో భార్యాబిడ్డలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు. రూలింగ్లో ఉన్న వారూ.. లేని వారూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను తిడితే కొమ్ములొస్తాయని అనుకుంటున్నారని, అది కుదరదని తేల్చి చెప్పారు. కించపరిచేలా మాట్లాడితే సీరియస్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాలుకలు తెగ్గోస్తాం
ఎంపీ, ఎమ్మెల్యేలైనా పోలీసులను అవమానించేలా, కించపర్చేలా మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కింది స్థాయి నుంచి పోలీసులంతా బాధ్యతగా పనిచేస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణచివేసి, సామాన్యులకు రక్షణ కల్పించింది పోలీసులేనని చెప్పారు.
ఎవరికీ భయపడం.. బాధేసింది..
తాము ఎమ్మెల్యేలు, ఎంపీల కోసమే కాదు, సామాన్య ప్రజల రక్షణ కోసం కూడా ఉన్నామని సీఐ మాధవ్ స్పష్టం చేశారు. మీకు తెలియదా? అసమర్థత ఎవరిదో అని తెలియదా? అంటూ రాజకీయ నేతలను ప్రశ్నించారు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. అధికారం, డబ్బు చూసి పోలీసు వ్యవస్థ డిఫెన్స్లో పడదని స్పష్టం చేశారు. నాయకుల మాటలు ప్రచారమాధ్యమాల్లో చూసి బాధేసి మాట్లాడుతున్నానని సీఐ తెలిపారు.
జేసీ అనుచిత వ్యాఖ్యలు
జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల మాధవ్, త్రిలోక్నాథ్, సూరీ డిమాండ్ చేశారు. కాగా, తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడులు చేస్తోంటే పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు పౌరషం లేదని మండిపడ్డారు. సిగ్గులేని పోలీసులు ఎంపీనైన తనను రోడ్డుపై కూర్చోబెట్టారని విమర్శించారు.