సమస్య పరిష్కారం అంత సులభం కాదు: బాబు, 'బడ్జెట్పై మాటమార్చిన విజయసాయి'
Recommended Video
అమరావతి: తాను అందరి మనోభావాలను అర్థం చేసుకున్నానని, సమస్య పరిష్కారం అంత సులభమైనది కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?
కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ఆ పదవుల కోసం మనం పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. విభజన నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం మనం పొత్తు పెట్టుకున్నామని తేల్చి చెప్పారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, ప్యాకేజీలోను సాయం లేదని చెప్పారు. రైల్వే జోన్ను పక్కన పెట్టేశారన్నారు.
అదే ప్రధాన అంశం
చంద్రబాబు నివాసంలోని ప్రజాదర్బారు హాలులో టీడీపీ సమన్వ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నేతలతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయమే ప్రధానాంశంగా ఈ సమావేశం కొనసాగింది. ఏపీకి అన్యాయం చేసింది కాబట్టే 125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయిందన్నారు.
విభజన సమయంలోనే పట్టుబట్టా
విభజన సమయంలోనే తాను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని పట్టుబట్టినట్లు చంద్రబాబు తెలిపారు. విభజన వల్ల అన్యాయం జరిగినా కేంద్రంతో సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని భావించి ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు.
ఆగ్రహంతో ఉన్నారని నేతలు, కుండబద్దలు
ఇటీవల జరుగుతున్న పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని, ముఖ్యంగా బడ్జెట్ లో మొండి చెయ్యి చూపించడంపై వారిలో ఉన్న కోపాన్ని తగ్గించకుంటే, పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు చెప్పారు. పలువురు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు.
వైసీపీ రెండు నాల్కల ధోరణి
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని, వారిలో ఉన్న ఆగ్రహమే మనలోనూ ఉందని చూపేందుకు ఏదో ఒకటి చేయాలని నేతలు అధినేతకు సూచించారు. బడ్జెట్పై స్పందించలేని స్థితిలో వైసీపీ ఉందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రెండు నాలుకల వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. జగన్ ఇప్పటి వరకూ బడ్జెట్ పైన తన ప్రతిస్పందనను చెప్పలేదన్నారు.
మాట మార్చిన విజయసాయి రెడ్డి
తొలుత బడ్జెట్ బాగాలేదని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి, ఆపై బాగుందని జాతీయ మీడియా ముందు వ్యాఖ్యానించడాన్ని కొందరు ప్రస్తావించారని తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ సభలో నిరసన తెలియజేయాలని చినరాజప్ప సూచించగా, ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని మరో మంత్రి అధినేతకు చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు కీలక నిర్ణయం తీసుకుందామన్నారు. మీరు (చంద్రబాబు) ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని చెప్పారు. పోలవరం పనులు ఆగిపోతే ఏమిటని కొందరు నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు స్పందిస్తూ.. సమన్వయంతో బ్యాలెన్సుగా నిర్ణయం తీసుకుందామన్నారు.