ఆ రూల్స్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం, రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది: యనమల
అమరావతి:15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దక్షిణ భారతంలోని రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఏప్రిల్ 10న కేరళ రాష్ట్రంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్ధికశాఖ మంత్రుల సమావేశంలో చర్చించనున్నట్టు యనమల రామకృష్ణుడు చెప్పారు.
కేంద్ర పథకాలు, ఇతర పథకాలు వాటాల సరళిని 90:10 నుండి 60:40గా మార్చడంతో రాష్ట్రాలపై అదనపు భారం పడనుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.ఏపీ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలని చేసిన వినతిని కూడ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఫైనాన్స్ కమిషన్పై కేంద్రం ఒత్తిడి తెస్తోందని, ఉత్తర భారత రాష్ట్రాలకు ప్రయోజనం కల్గించేదిగా ఉందని ఆయన విమర్శించారు.
పేద ప్రజలకు ప్రయోజనం కల్గించాలనే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని , ఫైనాన్స్ కమిషన్ నిబంధనల్లో ప్రస్తావించకపోవడంపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్రం తీరు ఉందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఏప్రిల్ 10న, దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు.