ఇప్పుడే ఇలా, విడిపోతే ఘోరం: విజయమ్మ, బాబుపైనా
గుంటూరు: రాష్ట్రం కలిసున్నప్పుడే నీటి సమస్యలు వస్తుంటే, ఇక విడిపోతే మరింత ఘోరం జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ విజయమ్మ గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి పోరు పేరుతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్ర భావి తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హయాంలో ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన టెండర్లను బాబు రద్దు చేశారని ఆరోపించారు. దేవేగౌడను ప్రధానిని చేశానని చెప్పుకునే బాబు ఆనాడు రైతులకు ఏం చేయలేదన్నారు. ప్రాజెక్టులు కట్టడంలో నిర్లక్ష్యం వహించారన్నారు.
ప్రస్తుతం మన ముందు విభజన, నీరు.. రెండు సమస్యలు ఉన్నాయని విజయమ్మ అన్నారు. మనం ఆంధ్రా, తెలంగాణ అంటూ కొట్టుకుందామా లేక కలిసుండి అభివృద్ధి వైపు సాగుదామా అని ప్రశ్నించారు. పెద్ద రాష్ట్రాలుగా ఉంటే భారీ ప్రాజెక్టులు కట్టుకోవచ్చునన్నారు. తెలంగాణకు 17, సీమాంధ్రకు 25 సీట్లుగా విడిపోతే ఇరు ప్రాంతాలు నష్టపోతాయని హెచ్చరించారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వమని వైయస్ అడిగితే బాబు అప్పుడు ఎద్దేవా చేశారని, ప్రాజెక్టులు కట్టలేదని అలాంటప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు ధర్నా చేస్తున్నారని, నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. వైయస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. వైయస్ మృతి తర్వాత జలయజ్ఞం మూలకు పడిందని ఆరోపించారు. ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించాకనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించాలని డిమాండ్ చేశారు.
ఇన్నాళ్లు ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం ఎన్నికల వేళ పింఛన్లు, ఉద్యోగాలు ఇస్తున్నాయని విమర్శించారు. తన హయాంలో ఇంకుడు గుంతలను ప్రోత్సహించిన బాబు ప్రాజెక్టులను విస్మరించాలని, ఆయనకు వైయస్ను విమర్శించే హక్కు లేదన్నారు. గత సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా విభజన చేస్తున్నారని మండిపడ్డారు.