మంత్రి నారా లోకేష్ ఐటి శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు కెళ్తాం:బిజెపి ఎంపి జీవీఎల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,మంత్రి నారా లోకేష్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి ఆరోపణలతో సరిపెట్టుకోవడం కాకుండా వాటిపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
ఎపిలో ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని జివిఎల్ తేల్చిచెప్పారు. కంపెనీలకు ప్రోత్సాహకాల ముసుగులో అనేక షెల్ కంపెనీలు సృష్టించారని ఎంపి జివిఎల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ స్వయంగా చూస్తున్న ఐటీ శాఖలో ఇలా ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారని జివిఎల్ చెప్పారు.
కంపెనీల...వివరాలు ఇవ్వండి
మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐటి శాఖలో వేల కోట్లు చేతులు మారాయని చెప్పడానికి 2014 నుంచి విడుదలైన జీవోలే ఉదాహరణ అని ఎంపి జివిఎల్ పేర్కొంటున్నారు. ఐటీ శాఖలో ఇంత భారీ స్థాయిలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లబోతున్నామని ఆయన ప్రకటించారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో... ఏమేమి వచ్చాయో వాటి వివరాలు ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
షెల్ కంపెనీలు...ప్రోత్సాహకాలు
ఐటి శాఖలో ఈ విధమైన షెల్ కంపెనీలకు 2014 నుంచి 2020 వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జీవోలు విడుదల చేశారని జీవీఎల్ వెల్లడించారు. ఆ విధంగా అనేక సంస్థలను తెచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల డబ్బులు దండుకున్నారని జివిఎల్ వివరించారు. అసలు నిజానికి అలాంటి షెల్ సంస్థలే తప్ప నిజంగా కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీలేవన్నారు.
భూములు కూడా...ధారాదత్తం
పైగా అలాంటి షెల్ కంపెనీలకు ల్యాండ్లను నామమాత్రపు ధరలకు ఇచ్చి...మూడేళ్ల తర్వాత కమర్షియల్ రేట్లకు అమ్ముకోవచ్చని కూడా చెప్పారని తెలిపారు. పైగా అతి తక్కువ ధరకు భూములు ఇచ్చి ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా వీలు కల్పించారని ఆరోపించారు.
అందుకే...కోర్టుకు
అసలు ఐటీ శాఖలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్ సమాధానం చెప్పాలని జివిఎల్ డిమాండ్ చేశారు. జీవోల పేరుతో ప్రజలను మాయ చేశారని వ్యాఖ్యానించారు. తాము అడిగిన సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అక్రమాల గురించి తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ను ఆర్టీఐ కింద సమాచారం కోరినా ఇవ్వడం లేదని ఎంపి జీవీఎల్ దుయ్యబట్టారు. చట్టప్రకారం ప్రజల వద్దకు చేరాల్సిన సమాచారం కూడా వారు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అందుకే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.