గోదావరి వరద బాధితులను ఆదుకుంటాం, తక్షణమే సరుకులు అందిస్తామన్న జగన్
హైదరాబాద్ : వరద ముంపు బాధితులను ఆదుకొంటామన్నారు ఏపీ సీఎం జగన్. ముంపు బాధితులకు అధికారులకు ఉదారంగా సహాయం అందించాలని స్పస్టంచేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ఆలస్యం చేయొద్దని తేల్చిచెప్పారు. విదేశీ పర్యటన ముగించిుకొని ఏపీ చేరుకున్న జగన్ .. వరద ముంపుపై అధికారులతో సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి వెంటనే సాయం అందించాలని తేల్చిచెప్పారు.
తూర్పు, పశ్చిమ గోదావిరి జిల్లాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు జగన్. తాడేపల్లిలోని తన నివాసంలో అధికారులతో చర్చించారు. సమీక్షలో హోంమంత్రి సుచరిత, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ధవళేధశ్వరం వద్ద 2, 3వ ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు వివరించారు. ఇప్పుడు ఒకటో ప్రమాదస్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. దీనికి గల కారణాలపై అధ్యయనం చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్.
గత ఆరు రోజుల్లో 500 టీఎంసీల జలాలు గోదావరి నదీ ద్వారా సముద్రంలోకి కలిసినట్టు అంచనా వేశామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. వచ్చే రెండురోజులు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండటం వల్ల వరదనీరు పోటెత్తుతుందని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాల్లేవని .. వచ్చే వారంలో వర్షసూచన లేదని వివరించారు. రానున్న 3 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబంధింత మంత్రులు పర్యటించి .. సహాయక చర్యలను పర్యవేక్షించాలని జగన్ స్పష్టంచేశారు.. మరోవైపు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని .. పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.