బొత్సపై పాలెం బాధితుల ఫైర్, ఎవర్నీ వదలం: సిఐడి
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదానికి కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టమని సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోందని తెలిపారు. 40 రోజుల్లో ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే బస్సులోని 45 మంది దుర్మరణం చెందారని ఆయన తెలిపారు.
పాలెం దుర్ఘటన కేసులో ఎవర్నీ వదిలిపెట్టమని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. చట్టపరంగా ఉన్న అంశాల్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇద్దరి అరెస్టుతోనే సరిపెట్టబోమని చెప్పారు. వోల్వో బస్సు బాడీబిల్డింగ్ లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, వీటన్నింటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని ప్రసాద్ తెలిపారు. ఐటిసి, ఎంవి యాక్ట్ కింద నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బస్సు ప్రమాదంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
రవాణా శాఖ నిర్వహించడంలో బొత్స విఫలం
రాష్ట్ర రవాణా శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విఫలమయ్యారని పాలెం బస్సు ప్రమాద బాధితులు ఆరోపించారు. వారు బుధవారం మాట్లాడారు. ఆర్టిఏ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే పాలెంలో బస్సు దుర్ఘటన చోటు చేసుకుందని అన్నారు. బొత్స సత్యనారాయణ, ఆర్టీఏ కమిషనర్, జెసి ప్రభాకర్ రెడ్డిపై మహబూబ్నగర్ కోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని బాధితులు తెలిపారు.
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, డిమాండ్ల పరిష్కారం కోసం అఖిలపక్ష నేతలతో కలిసి గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని బాధితులు చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.