కెసిఆర్ గెలవలేరు: శ్రీధర్, మద్దతు అడగమన్న పొన్నాల
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే అధికారంలోకి వస్తుందని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తామే సొంతంగా అధికారంలోకి వస్తామని, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు అవసరమే ఉండదని అన్నారు.
టిఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు వల్ల తెలంగాణ వచ్చిందంటే ప్రజలు నమ్మరని అన్నారు. ఏప్రిల్ 10న ఎంపి, ఎమ్మెల్యే, జడ్పిటిసి అభ్యర్థులతో, ఏప్రిల్ 11న మున్సిపల్ అభ్యర్థులతో సమావేశం కానున్నట్లు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
తన సీటే గెలువరు: కెసిఆర్పై శ్రీధర్
గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తన స్థానం నుంచి తానే గెలువలేకపోతున్నారని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవసరమైతే మిత్రపక్షాలైన ఎంఐఎం, సిపిఐ పార్టీల మద్దతు తీసుకుంటామని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.