జగన్ పార్టీది ఉడుత ఊపుళ్లే: దేవినేని ఉమ
నెల్లూరు/ జైపూర్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు తాత్కాలిక ఎత్తిపోతల పథకాన్ని మంత్రి దేవినేని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా, ప్రతిపక్ష నేత జగన్ పైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాలువల్లో అవినీతిని పారిస్తే, టీడీపీ ప్రభుత్వం సాగునీటిని పారిస్తోందని మంత్రి అన్నారు. అభివృద్ధి చక్రాల కింద అవినీతిపరులను తొక్కేస్తామని ఆయన హెచ్చరించారు.
ఏడాదిలోగా పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తే తనక మనుగడ ఉండదనే భయంతోనే జగన్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్ సంస్థలకు చెందిన వేలాది కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేయడంతో ఆయనకు మానసిక వ్యాధి సోకిందని మంత్రి అన్నారు.
తల తాకట్టు పెట్టయినా సరే రైతులకు రుణమాఫీని పూర్తి చేస్తుందని మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాం కంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో 8లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొజ్జల విమర్శించారు.
ఎపిలో విమానాశ్రయాల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తామని పౌర విమానయానాల మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. త్వరలోనే ఇవన్నీ కార్యరూపం దాల్చుతాయన్నారు. పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ప్రోత్సాహమిస్తోందని తెలిపారు. స్వచ్ఛభారత్కు అన్ని రంగాలు సహకరించాలని అశోక్గజపతిరాజు కోరారు. సదరన్ ట్రావెల్స్ జోన్ హోటల్ ప్రారంభోత్సవంలో అశోక్ పాల్గొన్నారు.