ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించేది లేదు: షాకిచ్చిన ఉద్యోగ సంఘాలు
విజయవాడ: ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీక వ్యవహారం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహించేందుకు వీలు లేదని కరోనా వైరస్ స్రెయిన్ కేసులు కూడా ఏపీలో కనిపిస్తున్నాయని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీకి లేఖ రాయడం జరిగింది. అదే సమయంలో పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది కూడా ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేమని తేల్చి చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉన్నందున ఎన్నికలను నిర్వహించలేమని చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు.
Recommended Video
ఎన్నికల నిర్వహణకు సహకరించం:
ఇవన్నీ జరుగుతుండగాను ఎన్నికలు నిర్వహణలో తాము పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు ఈసీకి షాక్ ఇచ్చాయి. ఈమేరకు ఉద్యోగ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించేందుకు తాము సిద్ధంగా లేమని తెలిపాయి. అంతేకాదు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సైతం ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఉద్యోగులు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అసహనం వ్యక్తం చేశాయి. కాదు కూడదు అని ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేయొద్దంటూ ఈసీకి విజ్ఞప్తి చేశాయి ఉద్యోగ సంఘాలు. కరోనావైరస్ ఒక్క కేసు ఉన్న సమయంలో దాన్ని సాకుగా చూపి నాడు ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేసిన ఈసీ... ఇప్పుడు ఇన్ని కేసులు ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలా ముందుకు వెళుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి ఉద్యోగ సంఘాలు.
వ్యాక్సిన్ సరఫరా పూర్తయ్యాకే...
ఇక రాష్ట్రాన్ని కొత్త రకం స్ట్రెయిన్తో పాటు కరోనా కేసులు వస్తున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి ఉద్యోగసంఘాలు. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ సరఫరా పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేశాయి. ఇక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని చెబుతున్న మాటల్లో నిజం లేదని చెప్పిన ఉద్యోగసంఘాలు అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించాయి.
ప్రాణాలకు ఎన్నికల సంఘం గ్యారెంటీ ఇస్తుందా
రాష్ట్రంలో 9 లక్షలకు పైగా ఉద్యోగస్తులుండగా వారందరి ప్రాణాలకు ఎన్నికల సంఘం గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించింది. ఇప్పటికే కరోనాబారిన పడి సాధారణ ప్రజలు ఉద్యోగస్తులు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని ఉద్యోగ సంఘం నేతలు గుర్తు చేశారు. కాబట్టి మొండిగా ముందుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఉపసంహరించుకుంటే అందరికీ మంచిదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.