లవ్ ఫెస్ట్ను అడ్డుకుంటాం, మహిళలకు రక్షణేది?: రోజా ఫైర్
విశాఖపట్నం: చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. నవంబర్ 6న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షణ నిమిత్తం పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా గురువారం విశాఖలో పర్యటించారు.
ఈ సందర్భంగా రోజాతోపాటు విజయసాయి రెడ్డి మాట్లాడారు. నారా వారి నరకాసుర పాలన పోవాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా అవసరమని రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రోజా వ్యాఖ్యానించారు.
కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోన్నట్లు సమాచారం. గతంలో గోవా బీచ్లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు.
ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
హోదాతోనే అభివృద్ధి: విజయసాయి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు చేస్తే ఆదాయం తగ్గిపోతుందనే వాదన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మద్యపాన నిషేదం అమలు చేస్తున్న గుజరాత్, బిహార్ లాంటి రాష్ట్రాలు నిజమైన అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఏపీలో అభివృద్ధి కేవలం పేపర్ల వరకే పరిమితమైందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
సోమిరెడ్డి అవినీతిపై విచారణ జరిపించాలి: కాకాణి
భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలను బహిరంగ చర్చకు రమ్మంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి చిట్టా వెలుగులోకి రావడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు తనపై ఆరోపణలు చేస్తురన్నారన్నాని మండిపడ్డారు ఇప్పటికైనా దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ నేతలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.