సివిల్ వార్ రావచ్చు: అశోక్, కేంద్రం కుట్ర: కడియం
హైదరాబాద్/వరంగల్: సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఏపి ఎన్జివో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. శనివారం ఆయన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీమాంధ్ర ఎంపీలే రాష్ట్రానికి పట్టిన దురదృష్టమని ఆయన అన్నారు.
కోటిమంది లోపు ప్రజలు మాత్రమే తెలంగాణ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందింస్తున్నట్లు ఆయన చెప్పారు. ముసాయిదా బిల్లు వస్తే సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా విభజనపై ముందుకు సాగితే సివిల్ వార్ రావచ్చునని ఆయన అన్నారు. బర్త్ డే కేక్ను కట్ చేసినంత ఈజీగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 24వ తేదీన తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మాత్రమే రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
టి బిల్లు వీగిపోయాలా కేంద్రం కుట్ర: కడియం
సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ బిల్లు వీగిపోయాలా కేంద్రం కుట్రలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం లీకులు చేయడం ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
ఆంటోనీ కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికల ఆధారంగా తెలంగాణ ఇస్తే నాలుగు జిల్లాలకే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఆ నివేదికలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా అని కడియం ప్రశ్నించారు. ఒప్పుకోకపోతే కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న కృతజ్ఞత సభల్లో ఏం చెబుతారని ఆయన వారిని ప్రశ్నించారు.
కాగా విభజన ప్రక్రియలో భాగంగానే టాస్క్ ఫోర్స్ నియామకం జరిగిందని మాజీ డిజిపి పేర్వారం రాములు అన్నారు. టాస్క్ ఫోర్స్ నివేదికపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పోలీసు శాఖ విభజన సూత్రంపై మాత్రమే టాస్క్ ఫోర్స్ తన నివేదికను రూపొందించిదని అన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతల విషయం టాస్క్ ఫోర్స్ నివేదిక పరిధిలో లేదని రాములు అన్నారు. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజలకే రక్షణ ఇస్తే తమిళనాడు, ఒడిశా ప్రజల మాటమేటని ఆయన ప్రశ్నించారు.