లాస్ట్ ఓవర్: తెరాస విభజనకు వ్యతిరేకమని అశోక్ లాజిక్
విజయవాడ: ఈ నెల 9వ తేదీన తాము లాస్ట్ ఓవర్ ఆడతామని గురువారం చెప్పిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా విభజనను వ్యతిరేకిస్తోందని లాజిక్ లాగారు. కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్య యువజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ బాబు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను సీమాంధ్రులు అడ్డుకుంటుంటే, రాయల తెలంగాణను కె చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని తెరాస అడ్డుకుంటోందని తద్వారా రాష్ట్రంలో తెరాస సహా అందరూ విభజనను అడ్డుకుంటున్నట్లేనని అభిప్రాయపడ్డారు. రాయలసీమను విభజించి రెండు జిల్లాలను తెలంగాణలో కలపడాన్ని తెరాస వ్యతిరేకిస్తున్న అంశంపై ఆయన పై విధంగా స్పందించారు.
రాష్ట్రాన్ని విభజిస్తే ఈ నెల 9న తాము లాస్ట్ ఓవర్ ఆడతామన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే తాము అదే రోజు అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. ఈ నెల 9న పదివేల మందితో ఇంద్రకీలాద్రి చుట్టూ మానవహారం నిర్వహిస్తామన్నారు. అదే రోజు హైదరాబాదులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సమావేశం జరగనుందన్నారు. ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.
తెలంగాణపై అసెంబ్లీని కాదని కేంద్రం పార్లమెంటుకు వెళ్తే తమ ఆందోళనలు ఉధృతమవుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తామని, విద్యుత్ నిలిపి వేస్తామని హెచ్చరించారు. శుక్రవారం తాము మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను కలుస్తామని, సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరుతామన్నారు.