రాజధాని నిర్మాణం ఖర్చు...అక్కడి ఆదాయంతోనే తిరిగి చెల్లిస్తాం:మంత్రి నారాయణ
Recommended Video
నెల్లూరు:నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తాము ఖర్చు పెట్టే ప్రతిపైసాకు అక్కడి ఆదాయంతోనే తిరిగి చెల్లింపులు జరుపుతామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
శుక్రవారం నెల్లూరులోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 నాటికి రాజధాని అమరావతిలో ప్రధాన పనులన్నీ పూర్తి చేసేస్తామన్నారు. తమపై అనవసర ఆరోపణలు చేసేవారు రాజధానిలో జరిగే పనులు చూసిన తరువాత మాట్లాడాలన్నారు. ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని, మరో రూ.20వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు జరుగుతాయని నారాయణ వెల్లడించారు.
మరోవైపు రాజధాని రైతులు ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయమై వారికి సీఆర్డీఏ అధికారులు శుభవార్త చెప్పారు. నిషేధం జాబితాలో ఉండి భూములు రిజిస్ట్రేషన్ కాని రైతులు వెంటనే తమ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాజధాని రైతుల భూములపై నిషేధం తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, టైం స్లాట్ బుక్ చేసుకుని రైతులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే భూ సమీకరణ పథకంలో భాగంగా తీసుకున్న ప్లాట్లను వారు తమ వారసులకు ఒకసారి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, ఆ అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నారు. అందుకోసం కుటుంబ సభ్యుల అఫిడవిట్, విభాగ దస్తవేజుతో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఇక రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తానే స్వయంగా గ్రామాల్లో పర్యటించనున్నట్లు శ్రీధర్ చెప్పారు. రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున రాధాని రైతులకు ఆయా గ్రామాల్లో కేటాయించిన ప్లాట్లను చూపించడం జరుగుతుందని...వాటికి సంబంధించి రైతులకు పూర్తి సమాచారం ఇస్తామని శ్రీధర్ చెప్పారు. రాజధాని రైతుల అన్ని సమస్యలను తాము పరిష్కరిస్తామని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ భరోసా ఇచ్చారు.
ఇదిలావుండగా వెలగపూడిలోని టీజీసీకి ఉత్తరం వైపున ఉన్న కలెక్టర్ రోడ్డుకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి పరచడం...దాని నిర్వహణ నిమిత్తం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.27.43 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా వాటిని దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 7వ తేదీ వరకు గడువు విధించింది. అలాగే విజయవాడ పరిసరాల్లోని అంబాపురానికి బీటీ రహదారి నిర్మించేందుకు రూ.3.49 కోట్ల అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లను పిలిచింది. ఆ గ్రామానికి సమీపాన ఉన్న జన్మభూమి రోడ్డు నుంచి దీనిని వేయనున్నారు. ఆసక్తిఉన్నటెండర్ల దాఖలుకు వచ్చే నెల 19వ తేదీ వరకు గడువునిచ్చింది.