సిగ్గుపడుతున్నా: ఏరాసు, సిఎంతో సహా రిజైన్ చేస్తాం
కర్నూలు/హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీలో కొనసాగుతున్నందుకు తాను సిగ్గుపడుతున్నానని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు తామంతా రాజీనామా చేస్తామని చెప్పారు.
విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కలిగే లాభనష్టాలను, సాగునీటి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి బిల్లులో ప్రస్తావించలేదని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ ప్రాంత ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. విభజన జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన శాయశక్తులా కృషి చేస్తున్నారని ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు.
కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది: అశోక్ బాబు
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన అన్నారు. తమ ఆందోళనకు చాలా పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్సభలో ఆమోదం పొందదని అశోక్ బాబు చెప్పారు.