మోడీ, అమిత్ షా కుట్రలు బయటపెడతాం: గల్లా జయదేవ్ ఆగ్రహం
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించేందుకే తాము సైకిల్ ర్యాలీలు చేపడుతున్నామని తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు గల్లా జయదేవ్ సోమవారం అన్నారు. కమలం పార్టీ కుట్రలను బయటపెడతామన్నారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. దాంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కేంద్రం ఆడుతున్న కపట నాటకాన్ని బయటపెడతామన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ప్రధాని మోడీపై బాలకృష్ణ వ్యాఖ్యలు.. వాస్తవమే, ఇదీ విషయం! బీజేపీకి ఉలుకెందుకు
గుంటూరులో మార్కెట్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన గల్లా జయదేవ్ అనంతరం సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. హిమానీ సెంటర్ నుంచి శారద కాలనీ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు పెద్దఎత్తున ఈ సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.