బిజెపిలో ఇబ్బందులు, టిడిపి అడ్డుకుంటోంది: బాబుపై కృష్ణం రాజు
కాకినాడ: భారతీయ జనతా పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న మాట వాస్తవమేనని నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు శుక్రవారం నాడు అన్నారు. ఏపీలో బిజెపి బలోపేతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఇబ్బందులు వాస్తవమేనని చెప్పారు.
పైస్థాయిలో బిజెపి - తెలుగుదేశం పార్టీ మధ్య అవగాహన బాగానే ఉందని చెప్పారు. కానీ కిందిస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. మార్చి 6వ తేదీన జరగనున్న బిజెపి సమావేశానికి పార్టీ అధ్యక్షులు అమిత్ షా హాజరవుతారని చెప్పారు.
సమావేసంలో చర్చిస్తే ఇబ్బందులు అన్నీ ఓ కొలిక్కి వస్తాయని చెప్పారు. అమిత్ షా పర్యటన తర్వాత మాత్రం సమస్యలు సర్దుబాటు అవుతాయని కృష్ణం రాజు చెప్పారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, అదంతా తమ ఘనతగా టిడిపి ప్రచారం చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ అంశాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో బిజెపిని స్వతంత్రంగా ఎదగనీయకుండా టిడిపి అడ్డుకుంటోందన్నారు.
రాష్ట్రంలో బిజెపి బలాన్ని చాటేందుకే రాజమండ్రి సభను వేదికగా చేసుకుంటున్నట్లు చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అనేక రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. మాజీ ప్రధాని వాజపేయి కలలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.
'కుప్పంలో రైతు ఆత్మహత్యలపై సిగ్గుపడాలి'
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన సిగ్గుపడాలని వామపక్ష నేతలు సిపిఎం నేత రాఘవులు, సిపిఐ నేత రామకృష్ణ శుక్రవారం మండిపడ్డారు.
నిత్యం నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ తిరగడం తప్పా, రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమ ద్రోహిని కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు దాపురించిందని ఎద్దేవా చేశారు.