కరోనా వేళ బీర్లు రెడీ..ఇంటిముందుకే చిల్డ్ బీర్స్: ప్రభుత్వం ముందు భారీ ఆఫర్
అమరావతి: లాక్డౌన్ వేళ అందరిదీ ఒక బాధైతే మద్యం ఉత్పత్తిదారులది మరో బాధ. వాస్తవానికి మద్యం రాష్ట్ర రెవిన్యూలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏపీ సర్కార్ మద్య పాన నిషేధం తీసుకురావడంతో ఆ ఇండస్ట్రీ ఒక్కింత నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇక కరోనా సమయంలో అన్ని మద్యం ఉత్పత్తి కంపెనీలు మూతపడటంతో కనీవిని ఎరుగని రీతిలో నష్టాలు ఉత్పాదక సంస్థలకు వచ్చాయి. తాజాగా బీరు ఉత్పత్తి సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం ఇంటికే బీర్లు సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత బ్రువరీస్ సంఘం లేఖ రాసింది.
మద్యం దొరక్క మానసికంగా కృంగిపోతున్న మద్యం ప్రియులు
కరోనా కష్ట కాలంలో మద్యం ప్రియులు మద్యం దొరక్క మానసికంగా కృంగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మద్యం అలవాటు ఉన్నవారు నెలరోజులుగా సీసా బీరు దొరక్క.. ఆ మద్యం నాలుకపై పడక మానసికంగా కృంగిపోతున్నారు. ఈ సమయంలో మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్యలకు సైతం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మద్యం ఉత్పాదక కంపెనీలు మద్యంను డోర్ డెలివరీ చేస్తామంటూ ఏపీ సర్కార్కు లేఖ రాశాయి. దీనివల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు మద్యం కంపెనీలకు లాభం చేకూరుతుందని లేఖలో వివరించాయి. మద్యంను డోర్ డెలివరీ చేస్తామని ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేశాయి.
ఇంటికే బీర్లు సరఫరా చేస్తాం: బ్రువరీస్ సంఘం
ఇప్పటికే డోర్ డెలివరీ చేస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రువరీస్ సంఘం లేఖ రాయగా అవి ఇందుకు అంగీకారం తెలిపాయని లేఖలో గుర్తు చేసింది బ్రువరీస్ సంఘం. లాక్డౌన్ కారణంగా గత నెల 22 నుంచి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులు కూడా క్లోజ్ అవడంతో మద్యాన్ని కొందరు బ్లాక్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకే సారి ఐదురెట్లు పెంచి మద్యంను అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీరు ప్రొడక్షన్ నుంచే రూ.60వేల కోట్లు ఆదాయం
కరోనా కారణంగా ఏప్రిల్, మే నెలల్లో దాదాపు రూ.16వేల కోట్లు మేరా నష్టం వచ్చే అవకాశం ఉందని మద్యం కంపెనీలు చెబుతున్నాయి. వేసవి కాలంలో మద్యం బిజినెస్ అత్యధికంగా జరుగుతుండగా ఆ వ్యాపారంపై కరోనా పెద్ద దెబ్బే కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం దుకాణాదారులు. ఇక మిగిలిన నెలల్లో కూడా పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా ఉండకపోవచ్చే అభిప్రాయం వ్యక్తం చేశారు. మద్యం నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వాటిల్లుతోందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చింది బ్రువరీస్ సంఘం. ఇక దేశంలో 86 కంపెనీల మద్యంను తయారు చేస్తుండగా.. దీని ద్వారా రూ.60వేల కోట్లు రూపాయలు మేరా ఒక్క బీర్లు మాత్రమే తయారు అవుతున్నట్లు బ్రువరీస్ సంఘం పేర్కొంది. ఇక అమ్మకాల ద్వారా వచ్చే పన్నుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.36వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలున్నట్లు బ్రువరీస్ సంఘం స్పష్టం చేసింది.
బీర్లు ఉత్పత్తి నిలిపివేతతో రైతన్నకు కూడా నష్టమే
బీర్ల తయారీకి కావాల్సిన బార్లీ, గోధుమలు,బియ్యం, చక్కెర వంటివి ఇప్పటికే రైతుల నుంచి సమకూర్చుకున్నామని లేఖలో ఏపీ సర్కార్కు స్పష్టం చేసింది బ్రువరీస్ సంఘం. బీర్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఒకరకంగా రైతు కూడా నష్టపోతున్నారని వెల్లడించింది. ఈ కష్ట సమయాల్లో మద్యం రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. దాదాపు 10 లక్షల మంది మద్యం ఉత్పాదక కంపెనీల్లో పనిచేస్తున్నారని చెప్పిన బ్రువరీస్ సంఘం... బీర్లు తయారు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అదే సమయంలో ఇంటికే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఇక సామాజిక దూరంను పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్త చర్యలను తీసుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇక మద్యంను కూడా అత్యవసర సేవల కిందకు తీసుకురావాలంటూ బ్రువరీస్ సంఘం ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.
Recommended Video