ఉండనని చెప్పా, రెండేళ్లు: రాజధానిపై కేఈ సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రాజధాని విషయమై ఆదివారం సంచలన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులను ఒప్పించే భూసమీకరణ చేపడతామన్నారు. రాజధాని మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడిగా ఉండనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పానని తెలిపారు.
రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోమని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లు కూడా సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు. రాజధాని పైన స్పష్టత వచ్చేందుకు మరో రెండేళ్లు పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. రైతులు సంతృప్తి చెందాకే భూములు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ శాఖలో పదవీ విరణ చేసిన తాత్కాలిక ఉద్యోగులకు తమిళనాడు, కర్నాటక తరహాలో నెలకు రూ.2వేల పింఛన్లు ఇస్తామన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలను మెట్రో సిటీలుగా మారుస్తామని స్పష్టం చేశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మాట్లాడారు.
ఏకపక్షం: మైసూరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు పోతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి అన్నారు. రాజధాని విషయమై ప్రభుత్వం అఖిల పక్షం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు.
మొండిగా వద్దు: తులసి రెడ్డి
రాజధాని పైన ప్రభుత్వం మొండిగా వ్యవహరించవద్దని తులసి రెడ్డి అన్నారు. పంట పొలాలు, గ్రామాలు నాశనం చేయవద్దన్నారు. వేల ఎకరాల కోసం రైతులను బలవంతం చేయవద్దన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక పరిగణలోకి తీసుకోలేదు
రాజధాని కోసం ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోలేదని జస్టిస్ లక్ష్మణ రావు అన్నారు. ల్యాండ్ పూలింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైతులను బలవంతం చేస్తే ప్రభుత్వానికి సమస్యలన్నారు.