తప్పుడు వదంతులు సృష్టిస్తే కఠిన శిక్షలు, ఆ నిందితుల అరెస్ట్: డీజీపీ
అమరావతి: సోషల్ మీడియాలో పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వదంతులను నమ్మకూడదని ఏపీ డీజీపీ మాలకొండయ్య ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ఆధారంగా అమాయకులపై దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకొంటున్న విషయం తెలిసిందే.
గురువారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏపీ డీజీపి మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ఆధారంగా అమాయకులపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తున్నవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నామని డీజీపీ చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని డీజీపీ మాలకొండయ్య హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగా నలుగైరుదుగురిపై దాడులు జరిగాయి.
సోషల్ మీడియాలో ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని దాడులు చోటు చేసుకొంటున్న ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అమాయకులపై దాడులు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై బాబు పోలీసు అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది.