నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.
తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని సంధిస్తున్న విమర్శల్లో పదును పెంచారు. కొన్ని సందర్భాల్లో అసభ్య పదాలు కూడా చంద్రబాబు నోటి నుంచి వచ్చేస్తున్నాయి. మంగళవారం తన సొంత జిల్లా చిత్తూరులో మదనపల్లి, చంద్రగిరి, పుత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. వ్యక్తిగత దాడులకు పూనుకున్నారు.
మిమ్మల్ని సెలవులపై ఎందుకు పంపించకూడదు?: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తలంటు
పోలవరంపై కేసీఆర్ కేసులు..
తెలంగాణ సీఎం కేసీఆర్ సీమాంధ్రులను అనవసరంగా కెలుకుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కేసీఆర్ సుప్రీంకోర్టులో రెండు కేసులు వేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసు వేశారని అన్నారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అని, ఆ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాకు కూడా నీటిని అందిస్తానని చెప్పారు. 70 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేస్తామని అన్నారు. గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామని అన్నారు.
నన్ను కెలికితే భద్రాచలాన్ని లాక్కుంటాం..
అలాంటి పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసు వేసి, కెలుకుతున్నారని చెప్పారు. తనను కెలికితే.. భద్రాచలాన్ని కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేస్తానని చంద్రబాబు చెప్పారు. భద్రాచలం ఒకప్పుడు ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. `భద్రాచాలం మాది.. దాన్ని తిరిగి తెచ్చుకుంటాం..` ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశానని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీకి నర్మదా బ్యారేజీని కట్టడానికి పదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీకి ఏ పనీ చేతకాదని అన్నారు. తల్లిని, భార్యను సరిగ్గా చూసుకోలేని మనిషని మోడీపై వ్యక్తిగత దాడికి దిగారు.
జగన్ ను కాపాడుతున్న చౌకీదార్
తాను పోలిసునని, తన వద్ద నకరాలు చేస్తే, ఎవ్వర్నీ వదిలి పెట్టనని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ డేటా చోరీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకులు డేటా దొంగల అవతారం ఎత్తారని ఆరోపించారు. డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి రాగానే..తాను దొంగలను పట్టుకోవడానికి సిట్ వేశానని చెప్పారు. భయపడి పారి పోయారని అన్నారు. ఢిల్లీలో ఉన్న కాపలాదారుడి వద్దకు వెళ్లి మోకరిల్లారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న మోడీ అనే కాపలాదారుడు.. ఆయన (జగన్)ను కాపాడారని చెప్పారు. తాను వదిలి పెట్టబోనని హెచ్చరించారు. డేటాను చోరీ చేసిన వారినెవ్వర్నీ తాను వదిలి పెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత అయినా సరే! ఏడు లక్షల దొంగ ఓట్లను వేసిన వారిని తాను వదిలి పెట్టబోనని, వారిని జైలుకు పంపించి తీరుతానని హెచ్చరించారు.
లోటస్ పాండ్ లో లోటస్..కలువ కుంటలో జగన్: చంద్రబాబు లాజిక్
జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఉంటున్నారని, అందులో ఉన్న లోటస్ అనే పదం బీజేపీకి ఎన్నికల గుర్తు అని చంద్రబాబు అన్నారు. అలాగే- తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంటిపేరు కలువకుంట అని, కలువకుంట అంటే ఇంగ్లీష్ లో లోటస్ పాండ్ అని అర్థమని చంద్రబాబు లాజిక్ చెప్పారు. మోడీ-కేసీఆర్-జగన్ కుమ్మక్కయ్యారనడానికి ఇది చాలదా అని చంద్రబాబు చెప్పారు. ఒక్క జగన్ కు ఓటు వేస్తే.. మోడీ, కేసీఆర్ లను గెలిపించినట్లేనని అన్నారు. కేసీఆర్ సీమాంధ్రులను కుక్కులని, రాక్షసులని, తరిమితరిమి కొడతామని తిట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ తిట్లను విని రోషం రావట్లేదా? అని చంద్రబాబు ఓటర్లను ఉద్దేశించి అన్నారు.
మీరంతా చుట్టపు చూపులే:
హైదరాబాద్ లో స్థిరపడిన కోడికత్తి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా మన రాష్ట్రానికి వచ్చి, వెళ్తున్నారని చంద్రబాబు విమర్శించారు. బెంగళూరు, తమిళనాడు, అమెరికాల్లో తెలుగు వాళ్లు స్థిరపడినట్టు హైదరాబాద్ లోనే ఉండాలని హెచ్చరించారు. ఆంధ్రాకు వచ్చి రాజకీయాలు చేస్తే మాత్రం తాను వదిలి పెట్టబోనని అన్నారు.
పోలీసులు నాకు సరిగ్గా సహకరించలేదు..
పోలీసులు తనకు సరిగ్గా సహకరించలేదని అన్నారు. వారు సరిగ్గా సహకరించినట్టయితే హత్య చేసిన వారిని దోషులుగా చిత్రీకరించే వాడినని చెప్పారు. హత్యకు ప్రతి హత్య తన సిద్ధాంతం కాదని అన్నారు. హత్యా రాజకీయాలు చేసే వారిని దోషులుగా నిర్ధారించి నడిబజారులో నిలబెట్టిస్తానని అన్నారు.