అంతా తూచ్! పవన్ కళ్యాణ్ కారణంగా ఓట్లు పడలేదు: టీడీపీ నేత, కాంగ్రెస్తో దోస్తీపై తేల్చేశారు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని టీడీపీ నేత, హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఆయన గురువారం, అలాగే అంతకుముందు రోజు మినీ మహానాడులో మాట్లాడారు. బీజేపీ కనుసున్నల్లో పవన్, జగన్ నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తన వల్లే గత ఎన్నికల్లో టీడీపీకి సీట్లు వచ్చాయని జనసేనాని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
Recommended Video
పవన్! నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, మీపక్కనే ఉన్న వ్యక్తి గురించి తెలుసుకో: గౌతు, శిరీష ఆగ్రహం
పవన్ కళ్యాణ్ లేకుండానే గెలిచాం
పవన్, బీజేపీ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గామని చినరాజప్ప తెలిపారు. పవన్ కారణంగా ఓట్లు పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. (గతంలో పవన్ వల్ల తమకు ఓట్లు పడ్డాయని టీడీపీ నేతలు చెప్పారు) జైలుకు వెళ్లిన జగన్ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం హాస్యాస్పదమన్నారు. అది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఏపీలో బీజేపీకి కాలం చెల్లిందన్నారు.
రాజకీయ పావుగా రమణదీక్షితులు
విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులపై కూడా చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అటు బీజేపీతో లాబీయింగ్ చేస్తూ ఇటు టీడీపీని విమర్శిస్తున్నారని ఆగ్రహించారు. టీటీడీ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనేది వారి ప్రయత్నమన్నారు. ఇందులో రమణదీక్షితులును పావుగా వాడుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్తో దోస్తీపై తేల్చేసిన టీడీపీ నేత
జేడీఎస్తో ఉన్న అనుబంధం కారణంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి తాము సిద్ధంగా లేమని తేల్చి చినరాజప్ప చెప్పారు. తమ అధినేత చంద్రబాబు దృష్టి అంతా మూడో ప్రత్యామ్నాయం పైనే అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లలేదని, కాంగ్రెస్తో చర్చించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వేదికపై కలుసుకున్నప్పుడు అభినందించుకోవడం మన సంస్కారం అన్నారు. కాగా, కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో రాహుల్ - చంద్రబాబులు చేయి కలిపి, భుజం తట్టుకున్న విషయం తెలిసిందే.
తెలుసుకొని మాట్లాడాలి
శ్రీకాకుళం ఉద్దానం సమస్యపై జనసేనానికి తప్పుడు సమాచారమిచ్చి, తప్పు దోవ పట్టిస్తున్నారని నారా లోకేశ్ అంతకుముందు అన్నారు. వ్యాఖ్యలు చేసే ముందు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో సుమారు రూ.16 కోట్ల నిధులతో ఏడు ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతీయ డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి, చికిత్స పొందుతున్న వారికి రూ.2,500 పింఛను అందిస్తున్నామన్నారు.