Weather forecast: ఈ నెలలో ఏపీ, తెలంగాణల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతోంది?
అమరావతి: కిందటి నెల రెండో వారం వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఓ మోస్తరుగానే కనిపించింది. తెల్లవారు జామున చలి వణుకు పుట్టించింది. రాత్రి ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి చేరుకున్న సందర్భాలు లేకపోలేదు. గత రెండేళ్ల కిందటితో పోల్చుకుంటే.. ఈ సారి చలి ప్రభావం ఎక్కువ రోజులు కొనసాగాయి. ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. క్రమంగా ఎండ తీవ్రత అధికమౌతోంది. వేసవి సీజన్ ఆరంభమైందనడానికి సంకేతంగా పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి కాలం దగ్గరయ్యే కొద్దీ మాడు పగలే ఎండలను చవి చూడకపోవడం తప్పకపోవచ్చు.
వైఎస్సార్ తరహాలో..మమతా సింగిల్ షాట్: 291 మంది అభ్యర్థుల లిస్ట్: క్రికెటర్, సినీ స్టార్స్
ఈ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ఎలా ఉంటుందనే విషయంపై భారత వాతావరణ కేంద్రం ముందస్తు అంచనాలను వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో సాధారణ కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఇదివరకు మర్చి నెలలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే.. ఈ సారి ఒకటి లేదా రెండు డిగ్రీల మేర తక్కువే రికార్డయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏపీ, తెలంగాణలతో పాటు దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ సబ్ డివిజన్ల పరిధిలో ఈ నెల మొత్తమ్మీద సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావచ్చని పేర్కొంది.
కర్ణాటక దక్షిణ ప్రాంతం, తమిళనాడుల్లో ఈ నెలలో ఎండ తీవ్రత ఉంటుందని సాధారణం కంటే ఎక్కువ అంచనా వేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర ఒడిశా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లల్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర, కొంకణ్, గోవా, తూర్పు-మధ్య భారత్, పశ్చిమ కోస్తా తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుందని, మున్ముందు అవి మరింత పెరుగుతాయని తెలిపింది. ఉత్తరాదిన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లల్లో ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.