మరో అల్పపీడనం: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్లు మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. జులై 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
ఆది, సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంద్రలో ఆదివారం, సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.
ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు కూడా అప్రమత్తమై భారీ వర్షాలపై ప్రజలకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆదివారం వర్షానికి కొంత విరామం లభించింది.
ఇది ఇలావుండగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తుండటంతోపాటు మాస్కులు, భౌతిక దూరం లాంటి కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.