మీడియా పేరుతో బ్లాక్ మెయిల్;ముందు కెమేరా కంటికి..ఆ తరువాత పోలీసులకు చిక్కారు..
గుంటూరు: మీడియా పేరిట ఓ సంస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం...గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుసుకు ''కమిలి'' అనే వార్తా పత్రిక రిపోర్టర్ కృష్ణారావు ఈ సంస్థ యజమానులపైబెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు మా ట్లాడుకుందాం రమ్మని పిలిచి వీరి భాగోతం అంతా సీక్రెట్ కెమెరాలతో రికార్ఢ్ చేసి పోలీసులకు పట్టించారు. అలా వీరి ఆట కట్టించారు.
ఆన్ లైన్ వ్యాపారంపై...కన్ను పడింది...
తెనాలి గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీలోని ఓ ఇంటిలో కొందరు యువత గ్రూపుగా ఏర్పడి కంపెనీల వస్తువులను ఆన్లైన్ ద్వారా క్రయవిక్రయాలు చేస్తున్నారు. వీరి వ్యాపారం బాగానే సాగుతున్నట్లు విజయవాడ కేంద్రంగా నడిచే కమిలి అనే వార పత్రిక తెనాలి రిపోర్టర్ అప్పారావుకు తెలిసింది.
వార్తలు రాస్తామంటూ...బెదిరింపులు....
దీంతో ఈ సంస్థ ప్రతినిధిని కలిసిన రిపోర్టర్ అపారావు మీ వ్యాపారం గురించి నెగిటివ్ గా వార్తలు రాస్తామని, పత్రికల్లో వస్తే ఇక మీ వ్యాపారం పని అంతేనని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన అతడు మిగతా భాగస్వాములకు విషయం తెలిపాడు. దీంతో వారు ఈ విషయంపై ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత మాట్లాడుకుందాం రమ్మంటూ రిపోర్టర్ అప్పారావును తమ సంస్థకు ఆహ్వానించి...మరోవైపు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం వారి కార్యాలయంలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు.
దందా రిపోర్టర్ వచ్చాడు...తనతో ముఠాను తెచ్చాడు...
దీంతో తమ పథకం పారుతోందని భావించిన రిపోర్టర్ అప్పారావు ఇదే విషయాన్నికమిలి పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, ఇతర రిపోర్టర్లు అప్పికొండ ప్రసాద్, దేవవరపు నరేష్బాబు కూడా వచ్చారు. దీంతో సంస్థకు విచ్చేసిన కమిలి పత్రిక ఎడిటర్ సౌజన్య మాట్లాడుతూ ఆన్లైన్ ట్రేడింగ్ కోసం మీరు జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో చెల్లించాలని, ఇవన్నీ పత్రికలో రాస్తే సుమారు కోటి రూపాయల వరకు కట్టాల్సి వస్తుందని, అందువల్ల మాకు రూ.40 లక్షలు ఇస్తే ఈ వార్త తమ పత్రికలో రాకుండా చూస్తామని నేరుగా విషయానికి వచ్చేశారు. సంస్థ ప్రతినిధులు అంత ఇచ్చుకోలేమని బేరమాడగా చివరికి రూ.20 లక్షలకు 'కమిలి ముఠా' సరే అన్నారు.
ఆ తర్వాత నేరుగా...పోలీసుల వద్దకు...
ఈ బేరసారాలన్నింటిని రహస్య కెమేరా ద్వారా రికార్డ్ చేసిన సంస్థ ప్రతినిథులు ఆ తర్వాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లారు. విషయం అంతా చెప్పి వీడియో మొత్తం చూపించి 'కమిలి ముఠా'పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి నీలా సునీల్ ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ముఠాను వారి స్టయిల్లోనే టెక్నాలజీ ఉపయోగించి ఆట కట్టించిన యువతను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు.