ఆ ఆర్థిక ప్యాకేజీ గురించి నేనే ప్రధానికి సూచించా: కరోనాతో కలిసి జీవించక తప్పదంటోన్న గల్లా
గుంటూరు: కరోనా వైరస్ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ మరి కొంతకాలం పాటు పొడిగించే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. అసోచామ్, సీఐఐ వంటి దిగ్గజ పారిశ్రామిక సంఘాల సమాఖ్యలు ఈ ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని బీజేపీయేతర రాజకీయ పార్టీలు సైతం దీనిపట్ల సానుకూలంగా స్పందిస్తున్నాయి.
ఏప్రిల్లోనే ప్రధానికి సూచించా..
తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కూడా 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీని స్వాగతిస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ను అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కుదేల్ అయ్యాయని, వాటికి పునరుజ్జీవింపజేయడానికి 20 లక్షల కోట్ల రూపాయలతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి ఉంటుందని తాను ఇదివరకే ప్రధానమంత్రికి సూచించానని గల్లా జయదేవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
ప్యాకేజీని స్వాగతిస్తున్నా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్లో పార్లమెంట్ సభ్యులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. పలువురు ఎంపీలు తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలను ఇచ్చారని చెప్పారు. దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా చెప్పుకొనే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు జీవం పోయడానికి భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని తాను అప్పట్లోనే సూచించానని అన్నారు.
కరోనాతో కలిసి జీవించక తప్పదు..
దీనికి అనుగుణంగా ప్రధానమంత్రి స్పందించారని చెప్పారు. ఈ ఆర్థిక ప్యాకేజీని తాను స్వాగతిస్తున్నానని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా కనీసం 10 శాతం ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ను పొడిగించాల్సి ఉంటుందని ప్రధాని సూచించారని అన్నారు. భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
పారిశ్రామిక రంగం పురోగమనానికి
దేశీయ పారిశ్రామిక రంగం పురోగమించడానికి ప్రధానమంత్రి ప్రకటించిన తాజా ఆర్థిక ప్యాకేజీ ఉపకరిస్తుందని గల్లా జయదేవ్ చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ప్రతి పారిశ్రామికవేత్త అనుసరించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగించుకోవడం, వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకోవడం వంటి చర్యల వల్ల పారిశ్రామిక రంగం బలోపేతమౌతుందని జయదేవ్ చెప్పారు.