రైతులు అలా భూములు ఇచ్చింది...ఏసు ప్రభువు స్ఫూర్తితోనే: చంద్రబాబు
గుంటూరు: హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చేసిన పరిస్థితుల్లో తాను నవ్యాంధ్ర రాజధాని కోసం భూములు కావాలని అడిగితే రైతులు వేల కోట్ల విలువైన భూములను ఉదారంగా ఇచ్చేసారని, ఇదంతా ఏసు ప్రభువు స్ఫూర్తితోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
గుంటూరు లూధరన్ స్కూల్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కేక్ కట్ చేసి పేద క్రిస్టియన్లకు చంద్రన్న కానుకలను బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధికి తన ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంతా చేస్తుందని అన్నారు. ఏసు దయవల్లనే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు.
ఒక్క పైసా లేకుండా కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చామని గుర్తు చేసిన ఆయన, సుమారు 45 వేల కోట్ల విలువ చేసే 35 వేల ఎకరాల భూమిని ఒక్క పైసా తీసుకోకుండా రైతులు ఉదారంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారని, ఇదంతా ఏసు ప్రభువు చూపించిన స్ఫూర్తేనని చెప్పారు.
సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకు క్రీస్తు మానవ రూపంలో జన్మించారు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ శుభం కలుగుతుంది. ఎన్టీఆర్ గుంటూరులోని ఆంధ్రా క్రైస్తవ కళాశాలలోనే చదివారు. ఎన్టీఆర్ పేరుతో అక్కడ ఒక బ్లాకు నిర్మిస్తాం. క్రిష్టియన్ల సంక్షేమం కోసం రూ.75 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు రూ.3 నుంచి 5లక్షలు ఇస్తాం. వచ్చే క్రిస్మస్ నాటికి గుంటూరులో ఆంధ్రప్రదేశ్ క్రిష్టియన్ భవన్ సిద్ధం చేస్తాం. వచ్చే బడ్జెట్లో క్రైస్తవులకు కేటాయింపులు పెంచుతాం. పేదవాళ్లు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ కానుక అందిస్తున్నాం అని చంద్రబాబు తన ప్రసంగంలో వెల్లడించారు.