'కేంద్రం చేతులు దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశంతో పాటు ఏపీ సర్వనాశనం'
ప్రత్యేక హోదా పైన కేంద్రం చేతులు దులుపేసుకుందని, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విజయవాడ: ప్రత్యేక హోదా పైన కేంద్రం చేతులు దులుపేసుకుందని, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గురువారం నాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను పక్కకు పెట్టిన చంద్రబాబు ప్యాకేజీ అంటూ వచ్చారని, ఇప్పుడు ఆ విషయంలో కూడా కేంద్రంతో కుమ్మక్కై ఏపీ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చామని కేంద్రం చేతులు దులిపేసుకుందన్నారు. ఇచ్చిన ప్యాకేజీకిఎలాంటి చట్టబద్ధత అవసరం లేదని పార్లమెంటులో చెప్పిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకు వెళ్లాలని డిమాండ్ ేచశారు.
చంద్రబాబు ప్రతిపక్షం చెప్పే సలహాలు విని ఉంటే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. తద్వారా జగన్ సూచనలు పాటించాలని చెప్పారు. లేదంటే ఇప్పటికే విభజన కారణంగా దెబ్బతిని, మరో పక్క పెద్ద నోట్ల రద్దుతో అస్తవ్యస్తంగా మారిన ఏపీ మరింత నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు చేతుల్లో ఘోరంగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్యాకేజీకి చట్టబద్దత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పది నుంచి పదిహేనేళ్లు హోదా తెస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ప్యాకేజీ విషయాన్ని కూడా పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.
అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్వైపింగ్ ఎలా చేయాలో చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని చెప్పారు. ఇప్పటి వరకు ఏ హామీలు నెరవేర్చారో చంద్రబాబు, కేంద్రం చెప్పాలని నిలదీసారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు ఆ తర్వాత కేసు నుంచి బయటపడేందుకు కేంద్రానికి ఏపీని తాకట్టు పెట్టారన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంతో పాటు ఏపీ కూడా సర్వనాశనమైందన్నారు. అసలు 13వ షెడ్యూల్లో పేర్కొన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు.