'మైక్ విరగ్గొట్టిన రేవంత్ రెడ్డిపై లేని చర్యలు వైసిపి ఎమ్మెల్యేల పైనా'
అమరావతి: గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మైకు విరగ్గొట్టారని, గవర్నర్ చేతిలోని పత్రాలను కూడా విసిరివేసిన సందర్భాలు ఉన్నాయని కానీ తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే తమకు నోటీసులు ఇవ్వడం ఏమిటని వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంగళవారం అన్నారు.
ప్రత్యేక హోదాను కోరుతూ తాము స్పీకర్ వద్దకు వెళ్లడం మేం చేసిన తప్పా అని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి మైక్ విరగ్గొట్టినా చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మాత్రం తమ పైన చర్యలు తీసుకోవడం ఎందుకో చెప్పాలని నిలదీశారు.
కాగా, వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నట్లు గైర్హాజరైన ఎమ్మెల్యేలు చెప్పారు. కోర్టు కేసు కారణంగా తాను హాజరు కావడం లేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నియంత పాలన: వాసిరెడ్డి
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని వైసిపి నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. టిడిపి సర్కార్ దోపిడీని ప్రశ్నిస్తే జర్నలిస్టులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న మీనమేషాలు లెక్కిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
స్విస్ ఛాలెంజ్ పైన కోర్టులో వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద అటార్నీ జనరల్ను పిలిపిస్తారు కానీ రాష్ట్ర ప్రజలకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా పైన కేంద్రంపై ఒత్తిడి మాత్రం తీసుకు రారా అని ప్రశ్నించారు.
టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు నిలదీస్తారనే భయంతో వైయస్ రాజశేఖర రెడ్డి పైన నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
స్విస్ ఛాలెంజ్ పైన హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే హడావుడిగా ఎందుకు ఏపీసీడీఈ చట్టాన్ని సవరించారో చెప్పాలన్నారు. డెవలపర్ వాటాలకు సంబంధించి వివరాలు చెప్పవలసి వస్తుందనే చట్టాలన్ని మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారని, బహిరంగంగా దోపిడీకి తెగబడ్డారన్నారు.