వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీ "డ్రామా" వెనుక ఇంత జరిగిందా ?
కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మధ్య రచ్చ కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన సిద్దార్ధ రెడ్డిపై ఆర్ధర్ ఎందుకు కస్సుమంటున్నారు నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య విభేదాలకు దారి తీసిన అసలు కారణాలేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...
అసెంబ్లీ మార్షన్ నుంచి ఎమ్మెల్యే వరకూ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ గా వ్యవహరించిన ఆర్ధర్ కు ఆయనతో సన్నిహిత సంబంధాల ఉండేవి.. వైఎస్ మరణం తర్వాత ఆర్ధర్ పేరు కూడా కనుమరుగైంది. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటికే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఐజయ్య టీడీపీకి ఫిరాయించడంలో ఆర్ధర్ పేరు పరిశీలనకు వచ్చింది. ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆచితూచి అభ్యర్ధిని ఎంపిక చేసిన జగన్, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్ధికంగా బలవంతుడు కానీ ఆర్ధర్ ను గెలిపించాల్సిన బాధ్యతను స్ధానికం యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డికి అప్పగించారు. దీంతో ఆర్ధర్ ను తన అంగబలం, అర్ధబలంతో గెలిపించారు బైరెడ్డి సిద్దార్ద రెడ్డి.
ఎమ్మెల్యే అయ్యాక ఆర్దర్ ఏం చేశారు ?
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆర్ధర్.. నియోజకవర్గంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తొలిసారి ఎమ్మెల్యే కావడం, రాజకీయాల్లో అంతగా అనుభవం లేకపోవడంతో తన గెలుపు కోసం శ్రమించిన యువనేత బైరెడ్డి కన్నుసన్నల్లో మెలగాల్సిన పరిస్దితి తలెత్తింది. కానీ ఆర్ధర్ మాత్రం సిద్ధార్ధరెడ్డిని లెక్క చేయలేదు. దీనిపై పార్టీ అధిష్టానానికి సిద్ధార్ఢ్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఆర్ధర్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చివరికి సిద్ధార్ధ రెడ్డికి మద్దతిస్తున్న జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలో ఎలా అడుగు పెడతారో చూస్తానంటూ తన అనుచరుల వద్ద తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ విషయం కాస్తా వైసీపీ పెద్దల వరకూ వెళ్లింది. దీంతో అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని మందలించాల్సి వచ్చింది.
నామినేటెడ్ పదవుల్లో ఆధిపత్యం
నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నందున ఆర్ధర్ మద్దతుతో నామినేటెడ్ పదవుల కోసం ఆయన అనుచరులు ప్రయత్నించారు. అయితే నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం ప్రయత్నించిన సిద్ధార్డ రెడ్డికి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్ధర్ సిఫార్సులను పార్టీ పెద్దలు పక్కనబెట్టారు. దీంతో ఆయన సిద్ధార్ధ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా ఆర్ధర్ వినలేదు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో కూడా తెలియదని, అందుకే ఈసారి తన అనుచరులకు మార్కెట్ యార్డ్ పదవుల్లో అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆర్ధర్ వైఖరిపై వైసీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిష్టానం నుంచి అనుకున్న స్ధాయిలో మద్దతు దొరక్కపోవడంతో ఆర్ధర్ నిన్న నందికొట్కూరులో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. అదీ పార్టీ అనుమతి లేకుండానే.
Recommended Video
చివరి నిమిషంలో రంగంలోకి వైసీపీ పెద్దలు..
ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే ఆర్ధర్ తన పదవికి రాజీనామా చేస్తానని ఫీలర్లు కూడా ఇచ్చేశారు. కానీ చివరికి నెల్లూరుకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్లతో పార్టీ పరువు తీయొద్దని చివరి సారిగా హెచ్చరికలు చేశారు. సీఎం జగన్ తో అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని నచ్చజెప్పారు. దీంతో సిద్ధార్ధరెడ్డితో తనకు ఎలాంటి సమస్యలు లేవని ప్రకటించి ఆర్ధర్ ఈ వివాదానికి తాత్కాలికంగా పుల్ స్టాప్ పెట్టారు. అయితే సీఎం జగన్ ను కలిశాక అయినా ఈ వివాదానికి తెర పడుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో నందికొట్కూరు రాజకీయాలకు జగన్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టగలరా అన్న చర్చ జరుగుతోంది.