సాక్షి టీవితో నారా బ్రాహ్మణి స్పెషల్ బైట్..
హైదరాబాద్: వ్యతిరేకతలే తప్ప కించిత్తు సానుకూలత లేని వ్యక్తుల మధ్య ఓ చిన్న పలకరింపు కూడా పెద్ద వార్తే! ఇక మీడియా ప్రభావం అధికంగా ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో.. ప్రత్యర్థి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారుతోన్న పరిస్థితి. తాజాగా హెరిటేజ్ డైరెక్టర్ అయిన నారా బ్రాహ్మణి సాక్షి చానెల్ కు 'స్పెషల్ బైట్ ఇవ్వడం' హాట్ టాపిక్ గా మారింది.
అయితే విషయం రాజకీయాలకు సంబంధించింది కాదు కాబట్టి.. బ్రాహ్మణి సాక్షికి స్పెషల్ బైట్ ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. హెరిటేజ్ రిటైల్ గ్రూప్ ను ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కొనుగోలు చేసిన నేపథ్యంలో.. సాక్షికి స్పెషల్ బైట్ ఇచ్చారు బ్రాహ్మణి. అంతకుముందు ప్రెస్ మీట్ ద్వారా ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆమె.. అనంతరం సాక్షికి స్పెషల్ బైట్ ఇచ్చారు.
కాగా, బ్రాహ్మణి ఇచ్చిన స్పెషల్ బైట్ ను సాక్షి చానెల్.. 'సాక్షి టీవితో బ్రాహ్మణి' అంటూ ప్రసారం చేసుకోవడం గమనార్హం. పలువురు ఉద్యోగులను ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ తొలగించుకున్న నేపథ్యంలో.. హెరిటేజ్ రిటైల్ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఈ స్పెషల్ బైట్ లో దానిపై స్పందించిన బ్రాహ్మణి.. అలాంటి భయాలేమి అవసరం లేదని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.