ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం విచారణ చేసిన జేసీ: ఏం చెప్పారో తెలుసా ?
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల వివాదానికి సంబంధించి విచారణ చేశారు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈసీ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ విచారణ జరిపారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట తన కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరైన శ్రీదేవి జాయింట్ కలెక్టర్ కు తన కులానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ధృవ పత్రాలు సమర్పించారు.
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీదేవి పై జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు అప్పటి సీఎస్ కు లేఖ రాశారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి వచ్చిన లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఉండవల్లి శ్రీదేవిని విచారణను ఎదుర్కొన్నారు. దీనితో ఆమె అన్ని వివరాలతో విచారణకి హాజరయ్యారు.
శ్రీదేవికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. తన మెడిసిన్ సర్టిఫికెట్లను ఆమె జెసి దినేష్ కుమార్ కి అందించారు . వైద్యురాలిగా చేసిన సర్వీసును కూడా పత్రాలతో సహా సాక్ష్యాలుగా చూపించారు. ఇక ఆమెను విచారించిన జేసీ విచారణకు ఎమ్మెల్యే శ్రీదేవి సహకరించారని,ఆమె తన కులాన్ని నిరూపించుకోటానికి కావాల్సిన అన్ని వివరాలు, ఆధారాలు అందించారని , ఆమె ఇచ్చిన పత్రాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి కులం విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.