చేతులు కట్టేసి: డ్రైవర్, నేతల్ని కాపాడలేకపోయారని స్టేషన్పై దాడి, పరుగులు తీసిన పోలీసులు, ఉద్రిక్తత
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యలపై సోమ డ్రైవర్ చిట్టిబాబు మాట్లాడారు. ఇరవై మంది మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా వచ్చారని చెప్పారు. తమకు తుపాకులు ఎక్కుపెట్టారని, వాహనాన్ని ఆపాలని హెచ్చరించారని తెలిపారు. వాహనాలు ముందుకు వెళ్తే బాంబులతో పేల్చేస్తామని బెదిరించారని అన్నారు.
వారు హెచ్చరించినా తాము ముందుకు వెళ్లామని డ్రైవర్ చెప్పారు. ఇంతలో మరికొందరు మావోయిస్టులు వచ్చి వాహనాలకు అడ్డంగా నిలబడ్డారని చెప్పారు. మావోయిస్టుల చేతులో తుపాకులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇందులో ఎమ్మెల్యే ఎవరు, మాజీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగారని చెప్పారు.
చుట్టుముట్టి, వెపన్స్ తీసుకొని: ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందు గంటసేపు మాట్లాడిన మావోలు
వారి చేతులు కట్టేసి
అనంతరం ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను కిందకు దింపి చేతులు కట్టివేశారని డ్రైవర్ చిట్టిబాబు చెప్పారు. తమ నుంచి చాలా దూరం అడవుల్లోకి తీసుకు వెళ్లారని చెప్పారు. తాము అక్కడి నుంచి పారిపోకూడదని కొందరిని కాపలా కూడా పెట్టారని చెప్పారు. గన్మెన్ల నుంచి తుపాకులు లాక్కున్నారని చెప్పారు.
Recommended Video
నలభై నిమిషాల తర్వాత కాల్పుల శబ్దం
దాదాపు నలభై నిమిషాల తర్వాత కాల్పుల శబ్దం వినిపించిందని డ్రైవర్ చిట్టిబాబు చెప్పారు. కాల్పుల శబ్దం వినబడిన తర్వాత తమను వదిలి పెట్టారని తెలిపారు. ఆ తర్వాత తాము అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో శాంతిభద్రతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందన
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యను పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు. తమ తమ నియోజకవర్గాల్లోని గ్రామాల సమస్యలు స్వయంగా తెలుసుకుంటేనే తప్ప ప్రజలకు న్యాయం చేయలేమన్నారు. ఆ పనిలో భాగంగానే గ్రామదర్శని కార్యక్రమానికి కిడారి వెళ్లారని చెప్పారు. మావోల ఘాతుకంలో ఇద్దరూ చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే క్రమంలో ఈ దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. సంక్షేమం, అభివృద్ధిలపై ప్రతి గ్రామానికి వెళ్లి చూడకుంటే ఎలా అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందన్నారు. మంత్రి నారా లోకేష్, స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా ఖండించారు. సర్వేశ్వర రావు చలాకీగా ఉండే వ్యక్తి అని కోడెల అన్నారు. ఆయనంటే తనకు ఇష్టమన్నారు. మావోయిస్టుల చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. హత్యలతో వారేమీ సాధించలేరని, సిద్ధాంతపరంగా పోరాడాలన్నారు. కుటుంబాలకు అండగా ఉంటామని లోకేష్ చెప్పారు.
అరకు పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన
అరకు పోలీస్ స్టేషన్ ఎదుట సోమ బంధువులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. సంఘటన జరిగి ఇంతసేపైనా వెళ్లకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పైన స్థానికులు దాడి చేశారు. నేతలను కాపాడటంలో విఫలమయ్యారంటూ స్థానికులు, బంధువులు పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. మూడ్రోజులుగా మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకుంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానికుల దాడితో అక్కడున్న పలువురు పోలీసులు పరుగులు పెట్టారు. దాడి నేపథ్యంలో డుంబ్రిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఓ కానిస్టేబుల్ పైన దాడి చేశారు. దాడిలో కానిస్టేబుళ్లకు గాయాలు కూడా అయ్యాయి. డుంబ్రీగూడతో పాటు అరకు పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేశారు. ఓ చోట పోలీస్ స్టేషన్ ఔట్ పోస్ట్ను తగులబెట్టారు.