గుంటూరులో దారుణం: తెల్లవారే సరికి విగతజీవిగా మారిన సోదరి, సోదరుడిపైనే అనుమానం..?
ఏమైందో తెలియదు, ఎలా జరిగిందో అంతకన్నా తెలియదు. కానీ ఓ యువతి మాత్రం విగతజీవిగా మారిపోయింది. గుంటూరు జిల్లాలో లక్కన అనూష అనే యువతి రాత్రికి రాత్రే హత్యకు గురైంది. ఆమె సోదరుడే హత్య చేశాడనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారని.. హత్య చేసి పారిపోయారని చెప్పడం సినిమా ట్విస్ట్ను తలపిస్తోంది.
ఇంటికొచ్చిన పిల్లలు..
నరసరావుపేటలోని లింగంగుంట్ల కాలనీలో లక్కన చిన్న బసవయ్య ఫ్యామిలీ ఉంటోంది. ఇతనికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అయితే శుక్రవారం రాత్రి అత్తమ్మ వారి గ్రామం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లారు. బంధువుల ఇంట్లో పెద్దకర్మ కోసం వెళ్లారు. వారి కుమార్తె అనూష, కుమారుడు కుమారస్వామిని మాత్రం ఇంటికి పంపించారు. వారిద్దరూ నరసరావుపేటకు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. కానీ రాత్రికి రాత్రే అనూష విగతజీవిగా మారారు.
తెల్లవారే సరికి..
శుక్రవారం రాత్రి ఏం జరిగిందో తెలియుదు కానీ.. శనివారం అనూష విగతజీవిగా మారారు. చనిపోయారని సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏం జరిగిందని కుమారస్వామిని అడిగితే రాత్రి 2 గంటల సమయంలో ఇంటికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. అనూషపై దాడి చేశారని.. దీంతో ఆమె చనిపోయిందని వివరించారు.
కనిపించని ఆనవాళ్లు
కుమారస్వామి చెప్పే మాటలను పోలీసులు విశ్వసించలేదు. చుట్టుపక్కల వారు కూడా కాలనీలోకి కొత్త వారు రాలేదని చెప్పారు. కొత్త వారు వచ్చిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో స్నిపర్ డాగ్స్ను పిలిపించారు. శునకాలు కుమారస్వామి వద్దే ఆగడంతో.. అతనిపైనే అనుమానాలు నెలకొన్నాయి. అదుపులోకి తీసుకొని అతడిని పోలీసులు విచారిస్తున్నారు.