ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ ఏంటి ? అక్కడ అసలేం జరిగింది ?
Recommended Video
ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునివ్వడంతో అందరి చూపు ఆ గ్రామం వైపు మళ్లింది. అసలింతకీ ఆత్మకూర్ లో ఏం జరిగింది.. చంద్రబాబు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? ఛలో పల్నాడు నిర్వహించాలని నిర్ణయానికి రావడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.
చంపేస్తారా?: జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు, ఏమన్నారంటే.?
పల్నాడులో వైసీపీ అరాచకం ... ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తల ఇళ్ళపై దాడులు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు టిడిపి కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ వాదన. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మొదటి నుంచి టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే టీడీపీ కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులు పల్నాడు ప్రాంతంలో మరింత దారుణంగా కనిపిస్తున్నాయి. ఇక పల్నాడు లోని ఆత్మకూరులో జరిగిన దాడులు ప్రభుత్వ అరాచక పాలన కు నిదర్శనమని సాక్షాత్తు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి.
టీడీపీ వర్గంపై వైసీపీ వర్గ కార్యకర్తల దాడులు .. పారిపోయిన 70 కుటుంబాలు కేసులు నమోదు చెయ్యని పోలీసులు
గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఆత్మకూరులో ఆది నుంచీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ గ్రామంగా పోలీసు రికార్డులకెక్కిన ఈ గ్రామ జనాభా సుమారు 2700 మంది. ఇందులో ఎస్సీ వర్గీయులు 600 మంది ఉండగా, ఇతరులు 2100 మంది ఉన్నారు . ఎస్సీ వర్గీయులు టీడీపీ, వైసీపీ వర్గాలుగా విడిపోయారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే టీడీపీ వర్గానికి చెందిన వారిపై వైసీపీ మద్దతుదారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇక దాడులు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయడంలో కూడా శ్రద్ధ చూపించలేదు. ఆ సంఘటనతో భయపడిన 70 టీడీపీ కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లిపోయారు. బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు.
ఇళ్ళకు తాళాలు వేసి ఉన్నా తాళాలు పగలగొట్టి వైసీపీ వర్గీయుల విధ్వంసం
ఇల్లు విడిచి వెళ్లినప్పటికీ తాళాలు వేసిన ఇళ్ల తాళాలను వైసీపీ వర్గీయులు పగలగొట్టి లోపల విధ్వంసం సృష్టించారు. వైసిపి దాడులకు భయకంపితులై గ్రామం విడిచిన బాధిత కుటుంబాలన్నీ దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని బంధువుల ఇళ్ళల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ గ్రామాల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. దీనిపై ఫిర్యాదుచేసినా పోలీసులు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. కొంత మందిని పోలీసులే వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇక వారు టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆత్మకూరులోనే గాక పల్నాడులో పలు చోట్ల తమ పార్టీ వారిని వైసీపీ వర్గీయలు ఊళ్ల నుంచి తరిమికొట్టారన్న విషయం టీడీపీ శ్రేణులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ .. నేడు బాధితులతో కలిసి ఛలో ఆత్మకూరు
టీడీపీ నేతల బృందాలు రూరల్ ఎస్పీని, స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదుచేసినా లాభం లేకపోయిందంటూ చంద్రబాబు బుధవారం ‘చలో ఆత్మకూరు'కు పిలుపిచ్చారు. ఇక దీంతో ఆందోళనకు గురవుతున్న వారికి అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చి మీతో పాటు నేను వస్తాను మీ గ్రామాలకు రండి అంటూ చలో ఆత్మకూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక అంతే కాదు ఛలో పల్నాడు ర్యాలీ పై రెండు, మూడు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొదట పోలీసులను బాధితులను గ్రామాలకు తీసుకొని వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తం కావడంతో వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్న బాధితులను ఆత్మకూరుకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.
ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఛలో ఆత్మకూరు .. పోటాపోటీగా టీడీపీ , వైసీపీ ర్యాలీలకు నిర్ణయం
సోమవారం 10 మంది బాధితులను గ్రామానికి రప్పించారు. వారు భార్యాబిడ్డలతో కాకుండా ఒంటరిగా వచ్చారు. పోలీసులు వారికి గ్రామంలోని లూథరన్ చర్చిలో పునరావాసం కల్పించారు. వారు సొంత ఇంటికి వెళ్లడానికి అంగీకరించలేదు. ఇక గుంటూరు లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో రెండు వందల మంది బాధితులు ఉన్నారు. నేడు ఛలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా బాధితులను గ్రామాలలో విడిచిపెట్టి వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. కానీ చంద్రబాబును బయటకి రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. పరిస్థితులు మారకుంటే వైసిపి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ కూడా కోడెల, యరపతినేని బాదితులతో కలిసి టీడీపీ ర్యాలీకి పోటీగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.