సింగపూర్తో అనుబంధమేంటో?: అనంత, 'హోదాను అడ్డుకుంటోందే బాబు'
అనంతపురం/కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, సింగపూర్ ప్రభుత్వానికి మద్య ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణ బాధ్యతలు సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగించడంతో చంద్రబాబు అసలు నైజం బట్టబయలైందన్నారు.
ఆయనో గోముఖ వ్యాఘ్రమని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పనులు ప్రారంభిస్తే సింగపూర్ కంపెనీలు రావన్న భయమా? అని నిలదీశారు.
హోదాను అడ్డుకుంటోంది చంద్రబాబే: సిపిఎం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను విస్మరించాయని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారన్నారు.
ఏపీకి కేటాయింపులు జరపని కేంద్ర ప్రభుత్వం భిక్ష వేస్తోందని, ఆ భిక్ష కోసం చంద్రబాబు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సర్కార్ పైన కూడా ఏచూరీ, రాఘవులు మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ సర్కార్కు చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు.