పవన్ కళ్యాణ్ - చిరంజీవిలతో ముద్రగడ 'ఢీ'! జగన్ ప్లాన్ ఏమిటి?
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయమయ్యారు. గతంలో వెలుగు వెలిగిన ఆ నేత.. ఆ తర్వాత దాదాపు కనిపించకుండా పోయారు. ఇప్పుడు కాపు గర్జన పేరుతో మరోసారి తెరపైకి వచ్చారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు ఆయన కేంద్రబిందువు అయ్యారు.
ఇప్పుడు ఆయన వెంట ఎక్కువ మంది కాపులు నడిచేలా కనిపిస్తున్నారు. టిడిపి-బిజెపి మిత్రపక్షానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. తుని ఘటన పైన రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆయన సీఎం చంద్రబాబును, పోలీసులను కూడా తప్పుబట్టారు. అయినప్పటికీ పవన్ వ్యాఖ్యలు ఒకింత చంద్రబాబుకు అండగా ఉన్నట్లు కనిపిస్తున్నాయనే వాదన వినిపించింది.
ఆ ఘటనలో ఇరువర్గాలను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారని, ఆయన సరిగానే మాట్లాడారని మరికొందరు అంటున్నారు. అయితే, వైరి పక్షాలు మాత్రం చంద్రబాబుకు అండగా నిలబడినట్లుగా కనిపించిందని అంటున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి అండ ఉంది. మెగా సోదరులు కాపు వర్గానికి చెందిన వారు.
కాపులు ఎన్నో ఏళ్లుగా ఓటు బ్యాంకుగా ఉంటున్నారు తప్పు.. అధికారం మాత్రం వారికి అందడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఎనిమిదేళ్ల క్రితం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంకు కాపులు మద్దతు పలికారు. 2009లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినప్పటికీ టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఓట్లు సంపాదించారు. ఆ ఓట్లకు చిరంజీవికి ఉన్న ఇమేజ్తో పాటు కాపు అంశం కూడా తోడైంది.
ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వేరే అంశం. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం చాలామంది కాపులు జీర్ణించుకోలేకపోయారని అంటుంటారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. టిడిపి - బిజెపిలకు పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు కూడా కాపులను బీసీల్లో చేర్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవలే కమిషన్ వేశారు.
నవ్యాంధ్రలో 27 శాతం కాపులు, అనుబంధ వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి, టిడిపి - బిజెపిలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ కాపు నేత ముద్రగడ పద్మనాభంను తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు.
కాపు సామాజిక వర్గాన్ని తన వైపు మళ్లించుకునేందుకు జగన్.. గతంలో దర్శకరత్న దాసరి నారాయణ రావును కూడా తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన దాసరిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా ముద్రగడకు మద్దతు పలుకుతున్నారు. తద్వారా చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు ధీటుగా... కాపులను తన వైపుకు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.