జగన్పై దాడి మీద రివర్స్: 'రిమాండ్ రిపోర్ట్పై టీడీపీ ఏం చెబుతుంది, ఉలిక్కిపాటు ఎందుకు'
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి ఘటనపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆయనను కలిసేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు.
చంద్రబాబుకు పోలీస్ రిపోర్ట్ షాక్, గురి తప్పితే ప్రాణం పోయేది!: జగన్కు సిట్ మెమో
తాను జగన్ను కలవాలనుకున్నానని, కానీ ఆయన చేతికి వాపు వచ్చిందని, అందుకే కలవలేకపోయానని చెప్పారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారని చెప్పారు. ప్రస్తుతం జగన్ రెస్టులో ఉన్నారని తెలిపారు.
రాత్రికి రాత్రే చంద్రబాబు విలేకరుల సమావేశం
జగన్పై దాడి జరిగిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు రోజుకో రకమైన మాట మాట్లాడుతున్నారని కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఆశ్చర్యపోయేరీతిలో రాత్రికి రాత్రే సీఎం విలేకరుల సమావేశం నిర్వహించి పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు.
రిమాండ్ రిపోర్టుపై టీడీపీ నేతలు ఏం చెబుతారు?
జగన్ను ఏకవచనంతో సంభోదించారని కోటంరెడ్డి అన్నారు. విచారణ పూర్తయినట్లుగా మంత్రులు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు ఇక విచారణ ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసే విచారణపై తమకు నమ్మకం ఎలా వస్తుందని నిలదీశారు. పోలీసుల రిమాండ్ రిపోర్టుపై అధికార పార్టీ నేతలు ఏం చెబుతారని అడిగారు.
ఆ రిమాండ్ రిపోర్ట్ వైసీపీది, తెలంగాణది, కేంద్రానిది కాదు
రిమాండ్ రిపోర్టు అంటే వైసీపీ రాసేది కాదని, అలాగే తెలంగాణ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం రిపోర్టు కూడా కాదని కోటంరెడ్డి చెప్పారు. రిపోర్టులో జగన్పై హత్యాయత్నం జరిగిందని, తృటిలో తప్పించుకున్నారని పేర్కొన్నారని గుర్తు చేశారు. నిందితుడు తన ప్లాన్ ప్రకారం అనుకున్నచోట పొడిచి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని రిపోర్టులో ఉందని చెప్పారు.
మీకు ఉలిక్కిపాటు ఎందుకు?
గురువారం దాడి జరిగిందని, అప్పటి నుంచి టీడీపీ నేతలు ఏదేదో మాట్లాడారని, ఇప్పుడు రిమాండ్ రిపోర్టుకు ఏం సమాధానం చెబుతారని కోటంరెడ్డి నిలదీశారు. ఈ దాడితో తమకు ఏ సంబంధం లేకుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందో చెప్పాలన్నారు. ఇది కోడి కత్తి డ్రామా అంటున్నారని, మరి ఇదే కోడి కత్తి గాయానికి టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ చేశారు. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.