ఆలయాల రక్షణపై ప్రభుత్వ వైఖరేంటి.?అక్కడ దివీస్ పరిశ్రమ అవసరమా.?సూటిగా ప్రశ్నించిన పవన్.!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న ఆలయాల విద్వసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరితో పాటు తీసుకొనే ముందు జాగ్రత్త చర్యల గురించి స్పష్టత ఇవ్వాలని ప్రబుత్వాన్ని డిమాండ్ చేసారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఇంతవరకు ఆదిశగా ఎందుకు కార్యాచరణ రూపొందించలేదని నిలదీసారు.
ఆలయాలకు భద్రత కరువు.. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ వకీల్ సాబ్..
ప్రస్తుతం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే సీసీ కెమెరాల మాట చెబుతున్నారని, అంతకుముందు ఏం చేసారని పవన్ అన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయని, అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఆలయాల అదికారులే కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం పురమాయించడం సరికాదన్నారు పవన్. ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యత్యానికి నిదర్శనమని మండిపడ్డారు వకీల్ సాబ్.
ఆలయాల భద్రత ఏదీ.? సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలన్న పవన్..
గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని చెబుతున్న ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నారు పవన్ కళ్యాణ్. విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారని, ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ కార్యక్రమాల్లోని అంతర్బాగమేనని పవన్ స్పష్టం చేసారు.
మొదట ఆలయాల విద్వంసాలను ఆపండి.. ప్రభుత్వం చిత్తశుద్ది చూపాలన్న జనసేనాని..
వైసీపి ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా కొత్త దేవాలయాల నిర్మాణాలను చూడలేమని పవన్ అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఉత్సవ విగ్రహాల్లా ఉండే కెమెరాలు కాకుండా ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేసారు. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు.
దివీస్ పరిశ్రమ అవసరమా.? పేదల ప్రాణాలతో చెలగాటం వద్దన్న గబ్బర్ సింగ్..
శనివారం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, దళితులు, ఆ ప్రాంత ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నవరం నుంచి ర్యాలీగా కార్యకర్తలు, నాయకులతో దివీస్ పరిశ్రమ ఏర్పాటు ప్రాంతాన్ని పవన్ పరిశీలిస్తారు. అనంతరం తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.