చంద్రబాబుకు లోక్ సత్తా అధినేత జెపి మద్దతు పలుకుతోంది అందుకా?...
Recommended Video
అమరావతి:ఈమధ్యకాలంలో లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్న మాటల్లో కొంత తేడా కనిపిస్తున్న విషయం అందరకీ అర్థం అయింది గానీ అది ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు...అయితే ప్రశ్నలెన్ని ఉన్నా సమాధానం ఒక్కటే...సోషల్ మీడియా...అన్న చందంగా మన నెటిజన్లు జెపి వాయిస్ ఛేంజ్ కి కారణం ఏంటో కూడా కనిపెట్టేశారు...అయితే అందులో నిజం ఎంత అనేది తేలాలంటే...కొంత కాలం...అంటే...దాదాపుగా ఈ విడత రాజ్యసభ ఎన్నికలు ముగిసేదాకా ఆగాలి...అదేంటి...దానికీ దీనికీ సంబంధమేమిటి..అనుకుంటున్నారా?...ఉందండి...అదేంటో తెలుసుకోవాలంటే చదవండి మరి...
స్ట్రయిట్ గా విషయానికొస్తే లోక్ సత్తా అధినేత రాజ్య సభ ఎంపీగా వెళ్లబోతున్నారట...అది కూడా టిడిపి నుంచట...ఏంటీ షాక్ అయ్యారా?...ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?...కాస్త ఆగి ఆలోచించండి...ఇది మరీ...అంత అసాధ్యమేనంటారా?...జరగడానికి ఆస్కారమే లేనటువంటిదా?...ఆ...ఏమో...ఎందుకు జరగకూడదు?...అని కూడా మీరే ఆలోచిస్తున్నారా?...మరదేనండి...నెటిజన్లా?...మాజాకా?...ఆ మహానుభావులకు ఏ విషయం గురించైనా ఇలాగే ఉప్పందుతుంది మరి!...సరే ఈ విషయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం!
ముందుగా...జెపి మారిన స్వరం గురించి...
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెఎఫ్ మీటింగ్ కు హాజరైన సందర్భంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు చాలామందిని షాక్ కు గురిచేశాయి...అవేంటంటే...కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జేపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జెపి ఏ బేస్ మీద ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కాని...ఇదేంటి జెపి ఇలా అన్నారు?...ఏదో మతలబు ఉందే అని అందరూ అనుకున్నారు...అంతలోనే...లెక్కల విషయమై జెపి వాదనను ఎపి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం కచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేననని జేపీకి ఐవైఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు.
ఇక అప్పటి నుంచే...చంద్రబాబు వ్యతిరేకుల నజర్...జెపిపై...
పాపం సామాజిక సమీకరణాల వల్లో...మరింకేమైనా కారణాలో తెలియదు...కానీ...చాలామందికి మొదటినుంచి జెపి అనుమానమే...జెపి లోపాయికారీగా టిడిపికి మద్దతు ఇస్తాడు అని జెపి అనేకసార్లు టిడిపిని...చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా నిలదీసినా...తప్పులు ఎత్తి చూపినా...జెపిని శంకించేవారు శంకిస్తూనే ఉన్నారు. అలాంటిది...ఇక జెపినే నేరుగా చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అంటే ఇక ఆగుతారా?...అంతే ఇక జెపి మీద ఆరోపణలు ప్రారంభించేశారు. చూశారా..మేము ముందు నుంచి చెబుతున్నాం...జెపి ఇదే...చివరికి ఇలాగే చేస్తాడని మేమెప్పటినుంచో అనుకుంటున్నాం...అంటూ తమ అనుమానాలే నిజమయ్యాయని వాదిస్తున్నారు....అంతేకాదు...అసలు జెపి కూకట్ పల్లిలో ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా కారణం టిడిపి సపోర్టేనని ఆ విషయాలు కూడా తవ్వుతున్నారు.
ఇంతకీ జెపి...టిడిపి తరుపున...రాజ్యసభకి...సాధ్యమేనా?
రాజకీయంగా, సాంకేతికంగా అయితే సాధ్యమే...ఇక నైతికంగా అంటారా?...ఇప్పటి రాజకీయాల్లో...మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలను పరిశీలిస్తే... ప్రస్తుత రాజకీయాల్లో కేవలం నైతిక విలువలే ఆధారం చేసుకొని ఎవరైనా పాలిటిక్స్ చేస్తారా అంటే సమాధానం కష్టతరమైన పరిస్థితి....కాబట్టి ఆ విషయాన్ని పక్కన బెడితే ...మార్చి నెలలో ఎపిలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా చూస్తే ఎపికి దక్కే మూడు రాజ్య సభ స్థానాల్లో రెండు టిడిపికి, ఒకటి వైసిపికి దక్కే అవకాశం ఉంది. అయితే టిడిపికి దక్కే ఆ రెండు రాజ్యసభ స్థానాల్లోనే ఒకటి జెపికి కేటాయిస్తే ఎలా ఉంటుందా? అని టిడిపి అధినేతే ఆలోచిస్తున్నారట...ఈ ప్రతిపాదనకు జెపికి కూడా చాలా నచ్చిందట...కారణం తాను రాష్ట్ర రాజకీయాల కంటే...తన ఆలోచనలకు జాతీయ స్థాయిలో ఉంటేనే దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందనేది జెపి ఆలోచనట...చంద్రబాబు కూడా జెపి లాంటి మేధావి జాతీయ స్థాయిలో తమ తరుపున ప్రతినిధిగా ఉంటే ముందు ముందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఎపి ప్రయోజనాల కోసం ప్రయత్నించే వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని లోటు జెపి ద్వారా కొంత పూడ్చుకోవచ్చని చంద్రబాబు యోచిస్తున్నారట...అందుకే...ఇలా జరగొచ్చని నెటిజన్ మేధావులు విశ్లేషిస్తున్నారు.
వీలైతే మూడో స్థానం...దాని మీద కూడా కన్నేసిన టిడిపి...
టిడిపిలో ఆ రెండో రాజ్య సభ సీటు కోసం చాలా గట్టి పోటీలే ఉందట...ఆఖరికి ముఖేష్ అంబానీ కూడా ఈ టిడిపి రాజ్య సభ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడని, అందుకే అమరావతి టూర్లకి వస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీటు ఎపిలో రిలయన్స్ వ్యవహారాలు చూసే మాధవ్ అనే వ్యక్తి కోసమట...అలాగే యనమల రామకృష్ణుడు, తెలంగాణా వాసి...చివరకు మెగాస్టార్ చిరంజీవి(పవన్ కోటా) పేరు సైతం...ఇలా వివిధ పేర్లు వినిపిస్తున్నాయి... మరి వీటిలో నిజమెంతో తెలియదు కానీ...ఆ సంగతి అటుంచితే...అసలు చంద్రబాబు వైసిపికి దక్కే ఆ మూడో ఎంపి సీటును కూడా తన ఖాతాలోనే వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారట...కారణం రాజ్య సభ ఎంపి సీటుకు కూడా చాలా పోటీ పెరగడం, అసలు కల్లో కూడా ఊహించనంత దిగ్గజాలు సైతం ఆ సీటును ఆశిస్తూ ఉండటం ఒక కారణమైతే...రాజకీయంగా సహజంగానే ప్రత్యర్థిపై పైచేయి కోసం మరో కారణం కాగా...ఆ సీటు దక్కకుండా చెయ్యడం ద్వారా వైసిపిని గట్టి దెబ్బ తీయాలని అనుకోవడం ఇంకో కారణమట...పవన్ కళ్యాణ్ ప్రాధాన్యాలు...వంటి మరికొన్ని కారణాల రీత్యా కూడా ఆ మూడో రాజ్య సభ సీటు టిడిపి గెల్చుకోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారట.
ఆ అవకాశం ఉందా?...అంటే...ఉందనే చెప్పాలి...
ప్రస్తుత ఎమ్మల్యేల సంఖ్య ఆధారంగా ఒక రాజ్యసభ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏల ఓట్లు అవసరం. టిడిపి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రెండు రాజ్యసభ స్ధానాలకు ఓట్లు వేశాక కూడా మరో 15 మంది ఎమ్మెల్యేల ఓట్లు అదనంగా మిగులుతాయి. మరోవైపు వైసిపికి 23 ఫిరాయింపు ఎమ్మెల్యేలు మినహాయిస్తే ఖచ్చితంగా ఆ మూడో ఎంపీ సీటు గెల్చుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో ఒక్కరు చివరి నిమిషంలో అనూహ్యంగా హ్యాండిచ్చినా వైసిపి రాజ్య సహ ఎంపీ సీటు హుళిక్కే...మరోవైపు టిడిపి తమకు మిగిలిన 15 ఎమ్మెల్యేలు, వైసిపి జంపింగ్ ఎమ్మెల్యేలు, బిజెపి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఆ పార్టీ బలం 42 కి చేరుతుంది. మరో ఇద్దరిని కలుపుకోగలిగితే చాలు ఆ మూడో రాజ్య సభ సీటు కూడా టిడిపి ఖాతాలో పడిపోతుంది...మరి తాజా రాజకీయ పరిస్థితులు...చంద్రబాబు చాణుక్యం ప్రకారం ఆ పని అసాధ్యమేమీ కాదుగా...ఇదండీ...జెపి వాయిస్ ఛేంజ్ వెనుకున్నకారణంగా చెప్పబడుతున్నకథ..రాబోయే ఎపి రాజ్య సభ ఎన్నికల గురించిన కథనం.