మంగళగిరి లో మతలబు ఏంటి..? ఆర్కె, లోకేష్ మద్య రసవత్తర రాజకీయం..!!
అమరావతి/హదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న లోకేష్ పోటీ చేస్తుండటంతో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల చూపు కూడా ఈ నియోజకవర్గంపై పడింది. భీమిలీ, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి లోకేష్ పోటీ చేస్తారని ముందునుంచీ ప్రచారం జరిగినా, చివరకు ఆయన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం, అక్కడ స్థానికంగా వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ రెడ్డికి ప్రజాదరణ ఉండడంతో పోటీ రసవత్తంగా సాగుతోంది.
పవనూ! మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయవు? టీడీపీలో రాజకీయ బ్రోకర్లు!
నువ్వానేనా అన్నట్టు సాగుతున్న రాజకీయం..! లోకేష్ ఆర్కె మద్య ఉత్కంఠ పోటీ..!!
చంద్రబాబు కుమారుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి మంత్రి అయ్యాడు నారా లోకేష్. కానీ ఆయన పోటీ చేసి గెలవలేదని ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. ఇక అవన్నీ పటా పంచలు చెయ్యడానికి, నేరుగా బరిలో దిగారు లోకేష్. రాజధాని పరిధిలోని మంగళగిరి నుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రెడ్డి మీద పోటీ చేస్తున్నారు. నిజానికి మంగళగిరిలో టీడీపీ బాగానే వున్నా , గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచాడు ఆర్కే. గెలిచిన తర్వాత రామకృష్ణా రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నట్టు స్థానికుకు చెప్పుకుంటున్నారు.
స్థానికంగా ఆర్కె కి మంచి ఆదరణ..! చెమటోడుస్తున్న లోకేష్..!!
బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్న ఆర్కేని ఎదుర్కోవడం లోకేష్ కు సమస్యగా పరిణమించింది. దీంతో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి, నారా లోకేష్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గల్లీగల్లీ, ఊరుఊరూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తోంది. గెలిచిన తర్వాత రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ మొదలు ఓటుకు కోట్లు కేసు వరకు టీడీపీపై, ప్రభుత్వంపై అనేక కేసులు వేసి తలనొప్పి తెప్పించారు. దీంతో పాటు నియోజకవర్గంలో ప్రజలకు 4 రూపాయలకే భోజనం అందించడం, 10 రూపాయలకే కూరగాయాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలను సొంత డబ్బులతో చేశారు.
పద్మశాలీ వర్గాన్ని దూరం చేసుకున్న టీడిపి..! ఇప్పుడేంటి కర్తవ్యం..!!
మంగళగిరి నియోజక వర్గంలో ఆర్కే లోకేష్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల పద్మశాలి సామాజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరడం కూడా వైసీపీకి కొంత కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం గత ఎన్నికల్లో పోటీచేసిన చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, కాండ్రు కమల ప్రయత్నించారు. వీరి ముగ్గురికీ కాదని చివరకు నారా లోకేష్ రావడంతో మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. కాండ్రు కమల పార్టీకి గుడ్ బై చెప్పగా, మిగతా ఇద్దరు నేతలు లోకేష్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే, మంగళగిరిలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలి సామాజకవర్గానికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై, వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఏకంగా సమావేశం పెట్టుకొని లోకేష్ ను ఓడించాలని తీర్మాణం చేశారు. దీంతో పద్మశాలి ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా మారితే, లోకేష్ కు కష్టంగా మారవచ్చు.
ఆర్కే పై కూడా ఆరోపణలు..! గెలుపుపై నెలకొన్న ఉత్కంఠ..!!
ఇక, ఎమ్మెల్యే మీద కోపంతో నియోజకవర్గాన్ని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది. ఇక్కడ షర్మిల కూడా ప్రచారం చేస్తుంది. ఇది కూడా లోకేష్ కు నష్టం చేసే అంశం గా పరిణమించింది. అయితే, లోకేష్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక పరిస్థితి కొంచెం టీడీపీకి అనుకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారని ఏసీబీ ముందు కూడా హాజరయ్యారు. ఇది కూడా టీడీపీ కి ప్లస్ అవుతుంది. పలువురు స్థానిక వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు. ముఖ్యనేత కావడంతో గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందనే భావన కొంత మంది ప్రజల్లో నెలకొంది. మొత్తానికి మంగళగిరిలో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగడం గ్యారెంటీ అనే చర్చ జరుగుతోంది.