పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్న
టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఏపీలో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రెండవ రోజు ఇళ్ళ పట్టాల పంపిణీ కొనసాగుతోంది. వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ పై, ఇళ్ల పట్టాల పంపిణీ పై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి అని ప్రశ్నించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
పేదవారికి ఇళ్లస్థలాలను ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు
బాపులపాడు మండలం ఏ సీతారాంపురం లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో 25, 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఉన్న సమయంలో పేదవారికి ఇళ్లస్థలాలను ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు అని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 9 వేల కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేసి నిరుపేదలకు పంచుతున్నారని వల్లభనేని వంశీ జగన్ కు కితాబిచ్చారు.
ఇళ్ల స్థలాల సేకరణ లో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించాలని సవాల్
అంతేకాదు ఇళ్ల స్థలాల సేకరణ లో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించాలని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నిరుపేదలకు సైతం ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేక పోయారని, ఇప్పుడు ఇచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు వల్లభనేని వంశీ. పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు నష్టం ఏంటి అని ప్రశ్నించారు.
నిరుపేదలకు ఇల్లు ఇస్తే, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేకపోతున్నాడు
నిరుపేదలకు ఇల్లు ఇస్తే, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేకపోతున్నారన్నారు వల్లభనేని వంశీ. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ వంశి డిమాండ్ చేశారు. చంద్రబాబు పోలవరం పెట్టకుండానే భజన చేయించుకున్నాడని ,మనవడికి పోలవరం చూపించడం కోసం బోలెడు డబ్బు ఖర్చు చేశారని పేర్కొన్నారు వల్లభనేని వంశీ.ఇక వల్లభనేని వంశీ మాత్రమే కాకుండా వైసీపీ మంత్రులు , ఎమెల్యేలు టీడీపీ నేతల విమర్శలను తిప్పి కొడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఇళ్ళ పట్టాల పంపిణీ
ఇక మరోవైపు 15 రోజుల పాటు పండుగలా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కొనసాగుతుందని సీఎం జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 2,700 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఈ రోజు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతున్నాం అంటూ మంత్రి కొడాలి నాని , ఎంపీ బాలశౌరిలు పేర్కొన్నారు.