ప్రజా తీర్పు ఏంటి ? దేశ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు ? నేడే జడ్జిమెంట్ డే
నరాలు తెగే ఉత్కంఠ.. ఎప్పుడెప్పుడా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ మరికొన్ని గంటల్లోనే తెలియనుంది .మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . దేశ ప్రజలు మరోసారి మోదీకి పట్టం కట్టారా? లేకా మరొకరికి అవకాశం ఇస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది . ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం పూర్తిగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. మరోసారి మోదీ పీఎం కావడం ఖాయమని స్పష్టం చేశాయి. కానీ మోడీని గద్దె దించాలని యూపీఏ , బీజేపీయేతర కూటమి విఫల యత్నాలు చేసింది. ఇప్పటికీ చేస్తుంది.
ఏపీ సహా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
ఇక దేశంలో ఆంధ్రప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? సరికొత్త రికార్డులు నమోదవుతాయా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. చంద్రబాబు దేశంలోని బీజేపీయేతర పక్షాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి మోడీ సర్కార్ రాకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నాల నేపధ్యంలో అసలు ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న చర్చ సాగుతుంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు .. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్పుల గణన
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 90 కోట్ల మంది ఓటర్లలో సుమారు 60 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సర్వీసు ఓటర్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. చివరగా ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కపెడతారు.
కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం .. 12 గంటల వరకు ట్రెండ్స్ తెలిసే అవకాశం
ఇక ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు ట్రెండ్స్ తెలిసిపోతాయి. తొలి ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, పూర్తి ఫలితాలు రావడానికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.