నాడు మోత్కుపల్లి,నేడు చింతమనేని: మెతకబడడం వెనుక?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ విషయంలో టిడిపికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. పార్టీని నమ్ముకొన్న వారిని కాదని, వైసీపీ నుండి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం పట్ల పార్టీ నాయకులు బహిరంగం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ విషయంలో టిడిపికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. పార్టీని నమ్ముకొన్న వారిని కాదని, వైసీపీ నుండి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం పట్ల పార్టీ నాయకులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.అయితే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ తొలుత సీరియస్ గా కన్పించినా తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో మెత్తబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని ఏప్రిల్ రెండవ తేదిన చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
తన రాజీనామా లేఖను తీసుకొని బాబును కలిశారు.అయితే ఈ విషయమై తొలిరోజు చోటుచేసుకొన్న పరిణామాల్లో చాలా సీరియస్ గా కన్పించినా ఎమ్మెల్యే తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో కాస్త మెత్తబడినట్టు కన్పిస్తున్నారు.
నాడు మోత్కుపల్లి నర్సింహ్ములును వారించి, నేడు చింతమనేని ఇలా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోఉంది. అదే సమయంలో రాజ్య సభ ఎన్నికలకు టిడిపి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వచ్చింది.అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశం ముగియగానే పార్టీ శాసనసభపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీ నాయకుల అభిప్రాయాలను బాబు తీసుకొన్నారు.అయితే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. తెలంగాణ నుండి గరికపాటి మోహన్ రావు, మోత్కుపల్లి నర్సింహ్ములు మద్య తీవ్ర పోటీ నెలకొంది.అయితే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం చంద్రబాబునాయుడు నివాసంలో జరుగుతోంది.అయితే ఈ మోత్కుపల్లికి బదులుగా గరికపాటికి రాజ్యసభ టిక్కెట్టు కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ విషయం తెలియగానే బాబు నివాసం నుండి మీడియా వద్దకు పరుగెత్తుకు వచ్చిన మోత్కుపల్లి ఆవేశంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మీడియా ప్రతినిధుల ముందునుండి మోత్కుపల్లి నర్సింహ్ములును చింతమనేని ప్రభాకర్ లాక్కెళ్ళాడు. బాబు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ సమయంలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవిని ఇస్తామనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.అయితే నాడు మోత్కుపల్లిని అడ్డుకొన్న చింతమనేని నేడు తనకు పదవికి రాకపోవడంతో పార్టీపై ఆవేశంతో ఊగిపోయారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
మంత్రి పదవిపై చింతమనేని ఆశలు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంత్రిపదవిపై ఆశలు పెట్టుకొన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చింతమనేని ప్రభాకర్ కు ప్రభుత్వవిప్ పదవిని కట్టబెట్గారు చంద్రబాబునాయుడు.ప్రభుత్వ విప్ గా చింతమనేని ప్రభాకర్ కొంతకాలంపాటు హుషారుగా కన్పించినా , తర్వాత మంత్రిపదవే సరైందని భావించారు. కాని, మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ ఆయనకు నిరాశే మిగిల్చింది. ప్రభాకర్ కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
ట్రాక్ రికార్డే కొంపముంచిందా?
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా స్వయంగా ఆయనే స్పందిస్తారనేది టిడిపి నాయకులు చెబుతుంటారు.ఒక్కోసారి ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతారు. స్వయంగా సమస్యలను పరిష్కరిస్తారనే పేరుంది.దీంతో ఆయనకు మంచి మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది.అదే సమయంలో తనకు మాస్ ఫాలోయింగ్ తో పాటు ట్రాక్ రికార్డు కూడ దెబ్బతింది.అధికారులపై నోరుపారేసుకోవడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చింతమనేని ప్రభాకర్ ట్రాక్ రికార్డును దెబ్బతీశాయి.
చింతమనేని ప్రవర్తనే కారణమా?
పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని నమ్ముకొని ఉన్నాడు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాడనే అభిప్రాయం చంద్రబాబునాయుడుకు ఉందని పార్టీ నాయకులు చెబుతుంటారు. పార్టీ పట్ల అంకితభావంతో చింతమనేని ఉంటారని బాబు కు ఉంది.అయితే అదే సమయంలో ఆయన కొన్ని సమయాల్లో వ్యవహారించే తీరువల్ల పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని బాబు భావిస్తున్నారు. ప్రభాకర్ ప్రవర్తన కారణంగానే పార్టీకి నష్టం వస్తోందనే అభిప్రాయం పార్టీ నాయకత్వానికి ఉంది. ఈ తరుణంలో మంత్రి పదవిని ప్రభాకర్ కు కట్టబెడితే ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.దీంతో మంత్రిపదవినికి చింతమనేనికి ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పితానికి మంత్రి పదవి ఇవ్వడం చింతమనేనికి చెక్ పెట్టడమేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు. ఎన్నికల ముందు సమయంలో పితాని కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే విజయం సాధించారు.అయితే కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి కార్యకర్తలపై కేసులు బనాయించడంలో పితాని కీలకంగా వ్యవహరించారని చింతమనేని వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చింతమనేని ప్రభాకర్ వర్గీయులపై ఈ కేసులను బనాయించారని టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు.అలాంటి పితానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల చింతమనేని వర్గీయులకు కంటగింపుగా మారింది. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ముందుగా టిడిపి ఎమ్మెల్యేలు. నాయకులు చింతమనేనికి మంత్రిపదవి ఇవ్వాలని బాబును కోరారు.అయితే బాబు మాత్రం సామాజిక సమీకరణాల వల్ల మంత్రిపదవి సాధ్యం కాదని తేల్చిచెప్పారు.అయితే చింతమనేనికి మంత్రిపదవికి ఇవ్వకపోవడమంటే ఆయనకు చెక్ పెట్టడమనే అభిప్రాయాన్ని కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్లు కల్పించుకొన్నా మెత్తబడలేదు, తర్వాత ఏమైంది
మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా పార్టీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆవేశంగా ప్రసంగించారు దెందులూరు ఎమ్మెల్యే తాను వేరే పార్టీలోకి వెళ్ళే ప్రసక్తేలేదన్నారు.అయితే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ విషయమై పార్టీ సీనియర్లు కల్పించుకొన్నా చింతమనేని ఆవేశాన్ని తగ్గలేదు. తన రాజీనామా లేఖను తీసుకొని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అందజేశారు. తర్వాత చంద్రబాబునాయుడును కలిశారు.అయితే బాబుకు, చింతమనేని ప్రభాకర్ మద్య ఏం జరిగిందో తెలియదు కాని, కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తనకు ప్రభుత్వం కల్పించిన గన్ మెన్లను ఆయన తిప్పి పంపారు.అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో గన్ మెన్లకు తిరిగి వచ్చారు.
హద్దుమీరితే భవిష్యత్తులో చర్యలు తప్పకపోవచ్చు
పార్టీ అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తే వెంటనే చర్యలు ఉండకపోయినా, భవిష్యత్తులో మాత్రం వాటి ప్రభావం టిడిపిలో కన్పించే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.హద్దులు దాటితే పార్టీ ధిక్కారంగానే భావిస్తోంది పార్టీ. అయితే పార్టీ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించే నేతలపై అప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వాటి ప్రభాకం కన్పించే అవకాశం లేకపోలేదు.